హైదరాబాద్: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఒక భారీ సైకలాజికల్ థ్రిల్లర్ రానుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్, బెంచ్మార్క్ స్టోరీటెల్లర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే షాన్ దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో అనుపమ, షాన్ కాంబినేషన్లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్ఫామ్పై సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఇప్పుడు అదే జోడీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతుంది. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఒక ప్రముఖ స్టూడియో భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత ప్రేరణ అరోరా గతంలో బాలీవుడ్లో ‘రుస్తుం’, ‘ప్యాడ్ మ్యాన’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి జాతీయ స్థాయి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇటీవలే ‘జటాధర’ను పట్టాలెక్కించిన ఈ సంస్థ, ఇప్పుడు అనుపమతో కొత్త సినిమాను ప్రకటించడం విశేషం. మే నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్ను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.


