Friday, March 6, 2026
Homeక్రీడలుతుది అంకానికి టీ20 ప్రపంచకప్

తుది అంకానికి టీ20 ప్రపంచకప్

- Advertisement -

. ఇక సెమీస్ పోరు
. నేడు దక్షిణాఫ్రికా I న్యూజిలాండ్
. రేపు భారత్ I ఇంగ్లాండ్
. వరుణ్ స్థానంలో కుల్దీప్?

ముంబై: టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ చేరాలని రెండు జట్లు తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తున్నాయి. భారత్, ఇంగ్లాండ్ పటిష్టంగా ఉండడంతో ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది. కాగా సెమీఫైనల్‌కు భారత తుది జట్టులో ఓ కీలక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకుని.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మధ్య ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ అవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కుల్దీప్ తన చైనామన్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. కీలక మ్యాచ్‌ల్లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. వరుణ్ కూడా మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు పొందినప్పటికీ.. ఇటీవల మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ మార్పుకు కారణమని సమాచారం. ఫైనల్‌కు చేరాలంటే భారత్, ఇంగ్లాండ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చిన్న మార్పు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపవచ్చు. టీమిండియా చివరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కితే… స్పిన్ విభాగంలో భారత్‌కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అభిమానులు ఈ కీలక మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన సంజు శాంసన్ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబేలు రన్స్ చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ ఒక్కడు రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా రాణిస్తున్నా.. మిగతా వారు రన్స్ కట్టడి చేస్తే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి.
భారత్ జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు