సీఎం చంద్రబాబు సమక్షంలో 4 కంపెనీలతో ఎంవోయూ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి/కుప్పం : అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో బుధవారం రూ.1,617 కోట్ల విలువైన ఒప్పందాలను ప్రభుత్వం చేసుకుంది. మొత్తం నాలుగు కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందాల్కో జనసేవా ట్రస్ట్ భాగస్వామ్యంతో కుప్పంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది. వచ్చే మూడేళ్లలో వెయ్యి మంది యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వనుంది. 50 మంది బంగారు కుటుంబాలను కూడా హిందాల్కో ట్రస్ట్ దత్తత తీసుకోనుంది. అలాగే సుమారు 750 కుటుంబాలకు జనసేవా ట్రస్ట్ ఉపాధి కల్పించనుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కల్పించనుంది. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి కూడా రీస్కిల్ కార్యక్రమం కింద శిక్షణ ఇస్తోంది. రూ.200 కోట్ల వ్యయంతో ఇ-ఆటోలు, ఇ-బైక్స్, ఇ-స్వీపింగ్ ఎలక్ట్రిక్ మెషిన్ల తయారీ కంపెనీ స్థాపనకు ఇ-రాయస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా 410 మందికి ఉపాధి కలగనుంది. కుప్పం నియోజకవర్గంలో ఇంటింటి చెత్త సేకరణకు 130 ఇ-ఆటోలను ఇ-రాయస్ సంస్థ అందించనుంది. రూ.525 కోట్లతో సమీకృత పాల ఉత్పత్తులు పోషకాహార కాంప్లెక్స్ ఏర్పాటుకు ఏస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదిరింది. దీనివల్ల సుమారు 7 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. స్థానిక పాడి రైతులకు ఏస్ ఇంటర్నేషనల్ అన్నివిధాలా సహకారం అందించనుంది. రోజుకు 7.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసేలా ప్లాంట్ నిర్మాణం చేపడుతుంది. ఇక రూ.372.8 కోట్ల పెట్టుబడితో ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో మరో ఒప్పందం కుదిరింది. దీనివల్ల 2 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా ప్లాంట్ ఏర్పాటు చేయనుండగా, 3 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ మూడు సంస్థలూ 2026 డిసెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.


