డా. కె.నారాయణ
మేడారం సమ్మక్క-సారక్క జాతరను కేవలం “ఆధ్యాత్మిక ఉత్సవం”గా చూపించడం చరిత్రను వక్రీకరించడం. ఇది ఆదివాసీ ప్రజల రక్తం-వేదనలతో నిండిన తిరుగుబాటు చరిత్ర. ఇది సామంత రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాప్రతిఘటన. కాకతీయుల కాలంలో ఆదివాసీ సమాజంపై భూముల దోపిడీ, అన్యాయ పన్నుల దండుగ, బెదిరింపులు, అణచివేత, సామాజిక అవమానాలు అమానుషంగా సాగిన వేళ, సమ్మక్క-సారక్క దోపిడీ పాలకులపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.ఈ పోరాటం “దేవతల కథ” కాదు. ఇది దోపిడీ వ్యవస్థపై పోరాటం.ఇది ఆదివాసీ శ్రమజీవుల స్వాభిమాన యుద్ధం. ఇది ప్రజాశక్తి ఏకమైతే సామంత రాజ్యాధికారం వణికిపోతుందనే చారిత్రక సత్యం. సమ్మక్క-సారక్కలు దోపిడీకి తలవంచలేదు అణచివేతకు లొంగలేదు. రాజుల దండుకు భయపడలేదు. అందుకే వారు దేవతలు కాదు. ప్రజా వీరమాతలు, తిరుగుబాటు నాయకులు, అణచివేత వ్యతిరేక పోరాట ప్రతీకలు. ఈ జాతరలో దాగి ఉన్న సందేశం స్పష్టంగా తెలుస్తుంది. దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి. శ్రమజీవుల ఐక్యతను బలపరచండి. ఆదివాసీ హక్కులను రక్షించండి. భూమి, నీరు, అడవిపై ప్రజల అధికారం స్థాపించండి. ఆదివాసీ ప్రాంతాలను దోపిడీ పెట్టుబడిదారీ దండయాత్రకు ఆదివాసీల భూములపై కన్నేసే శక్తుల సీపీఐ హెచ్చరిస్తోంది. ఇది భక్తి కాదు…ప్రజా పోరాటగడ్డ. ఇది వ్యాపారం కాదు తిరుగుబాటు చరిత్ర. అలాగే ఈ జాతర నేపథ్యంలో సీపీఐ కొన్ని అంశాలను డిమాండ్ చేస్తోంది. ఆదివాసీల భూములు, అడవులు, వారి జీవనాధారాలపై కార్పొరేట్ దండయాత్రను నిలిపివేయాలి. మేడారంలో ప్రజా సంక్షేమ సౌకర్యాలు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి. ఆదివాసీ సంస్కృతి, చరిత్రను గౌరవిస్తూ ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక అమలుచేయాలి. ఆదివాసీలపె పోలీసు అణచివేత పెడుతున్న తప్పుడు కేసులు నిలిపివేయాలి. మేడారం సమ్మక్క సారక్క జాతర మనకు గుర్తు చేసేది ఒక్క విషయాన్నే. ప్రజలు పోరాడితే చరిత్ర మారుతుంది. శ్రమజీవుల ఐక్యతే నిజమైన శక్తి. దోపిడీ వ్యవస్థను కూల్చే పోరాటమే విముక్తి మార్గం. ఛైర్మన్, సెంట్రల్ కంట్రోల్ కమిషన్, సీపీఐ


