. పారామిలిటరీ ఘాతుకం
. ఐరాస సంచలన నివేదిక
న్యూయార్క్: సూడాన్లో పారామిలిటరీ దళాలు సృష్టించిన మారణకాండపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) సంచలన నివేదిక విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ చివరిలో దార్ఫుర్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల్లోనే రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆరఎసఎఫ్) దళాలు 6వేల మందికి పైగా పౌరులను అత్యంత క్రూరంగా హతమార్చినట్లు తెలిపింది. ఈ హింస దిగ్భ్రాంతికరంగా ఉందని, ఇవి యుద్ధ నేరాలు, మానవత్వంపై ఘోరాలతో సమానమని ఐరాస మానవ హక్కుల కార్యాలయం తన నివేదికలో పేర్కొంది. నార్త్ దార్ఫుర్లోని ఎల్-ఫాషెర్ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆరఎసఎఫ్, దాని మిత్రపక్ష అరబ్ మిలీషియాలు ఈ ఘాతుకాలకు పాల్పడ్డాయని 29 పేజీల నివేదికలో వివరించింది. సామూహిక హత్యలు, లైంగిక దాడులు, చిత్రహింసలు వంటి అనేక అకృత్యాలకు పాల్పడ్డారని పేర్కొంది. యూనివర్సిటీ ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్న వారిపై కాల్పులు జరపడంతో పాటు, పారిపోతున్న వారిని కూడా వదలకుండా చంపేశారని తెలిపింది. చాలా సందర్భాల్లో జాతి ప్రాతిపదికన ఈ దాడులు జరిగాయని నివేదిక వెల్లడించింది. సూడాన్ సైన్యానికి, ఆరఎసఎఫ్కు మధ్య ఏప్రిల్ 2023 నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ దాడులు జరిగాయి. “శిక్షలు పడవన్న ధీమానే హింస నిరంతరం కొనసాగేలా ప్రోత్సహిస్తోంది” అని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. 140 మంది బాధితులు, సాక్షులను ఇంటర్వ్యూ చేసి, శాటిలైట్ చిత్రాలతో సరిపోల్చి ఈ నివేదికను రూపొందించినట్లు ఐరాస తెలిపింది. ఈ మారణకాండపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చింది.


