వందేళ్ల అవసరాలకు తగినట్టుగా వసతులు
. పనుల వేగవంతానికి అధికారులతో సమన్వయ కమిటీ
. తరచూ క్షేత్రస్థాయిలో పనుల తనిఖీ
. సమీక్షలో సీఎం రేవంత్
విశాలాంధ్ర – హైదరాబాద్: ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆసుపత్రిపై బుధవారం తన నివాసంలో సీఎం సమీక్షించారు. వందేళ్ల అవసరాలకు తగినట్టుగా వసతులు, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చు కోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధునాతన గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణలు ఉండాలని సూచించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాల న్నారు. పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమావేశమై సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అన్నారు. బందోబస్తు.. ట్రాఫిక్ విధుల నిర్వహణకు ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలన్నారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, వికాస్రాజ్, క్రిస్టియానా జోంగ్తూ, ఇలంబర్తి, ముషారప్ అలీ ఫరూఖీ, హరిచందన పాల్గొన్నారు.


