Sunday, June 1, 2025
Homeకృష్ణమ్మకు వరద మొదలు

కృష్ణమ్మకు వరద మొదలు

నైరుతి ప్రభావంతో ఎగువ ప్రాజెక్టులకు జలకళ
జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టుకు 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదికి వరద ప్రవాహం ప్రారంభమైంది. సహజంగా మే నెలలో కృష్ణానదిపై రిజర్వాయర్ల జలమట్టాలు డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటాయి. అయితే మే నెల చివరిలోనే ఎగువ ప్రాజెక్టులకు వరద ప్రవాహం ప్రారంభం కావడం గమనార్హం. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వచ్చి చేరుతుండడంతో… ప్రాజెక్టుకున్న 12 గేట్లు ఎత్తి 88 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద దిగువ ప్రాజెక్టులకు వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 818.3 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.61 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 21,252 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా… 800 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. దిగువనున్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 135.78 టీఎంసీలుండగా, 7,950 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. కర్నాటక- తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు మాత్రమే వరద వస్తుండగా, దానికి ఎగువన ఉన్న కర్నాటకలోని నారాయణపూర్‌కు మాత్రం ప్రవాహమేదీ లేదు. సాధారణంగా జూన్‌ తరువాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం విశేషం. జూరాల ప్రాజెక్టు వద్ద రెండు విద్యుత్‌ యూనిట్లు, దిగువ జూరాల విద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా జలవిద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. ఇటీవల ఈ ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోయి తాగునీటికి ముప్పు వచ్చే ప్రమాదాన్ని గమనించి ఐదు టీఎంసీలు విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని తెలంగాణ కోరగా… ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీఎంసీ నీరు విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో మే నెలలో ప్రాజెక్టుకు భారీ వరద రావడం, చివరకు గేట్లు ఎత్తి దిగువకు వదిలే పరిస్థితులు నెలకొనడం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరుదైన పరిణామంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇక కృష్ణానదికి టెయిల్‌ ఎండ్‌ ప్రాంతంలో ఉన్న ప్రకాశం బ్యారేజీకి కూడా ఎగువున కురుస్తున్న వర్షాల కారణంగా 2 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యం పూర్తిస్థాయిలో 3.7 టీఎంసీలు ఉండడంతో… ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు