Friday, May 30, 2025
Home‘ట్రంప్‌ టారిఫ్‌’తో సంబంధం లేదు

‘ట్రంప్‌ టారిఫ్‌’తో సంబంధం లేదు

కాల్పుల విరమణపై భారత్‌ వివరణ

న్యూదిల్లీ : భారత్‌-పాక్‌ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్‌ ఎట్టకేలకు స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి, ‘ట్రంప్‌ టారిఫ్‌’కు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ‘టారిఫ్‌ అధికారం వల్లనే ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్‌ సాధించగలిగారు’ అంటూ అమెరికా యంత్రాంగం కోర్టులో వాదించిన నేపథ్యంలో భారత్‌ ఈ వివరణ ఇచ్చింది. ‘ఈ అంశంపై భారత వ్యతిరేకతను వ్యక్తం చేశాం. మే 7న ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి మే 10న జరిగిన కాల్పుల విరమణ వరకు… సైనికపరమైన పరిణామాలపై భారత్‌-అమెరికా మాట్లాడుకున్నాయి. ఆ సమయంలో సుంకాల ప్రస్తావన ఎన్నడూ రాలేదు’ అని విదేశాంగ శాఖ గురువారం మరోసారి స్పష్టం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌పై మే 9న ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాట్లాడారు. అగ్రరాజ్య విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో మే 8, 10 తేదీల్లో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపారు. మే 10న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ మాట్లాడారు. ‘ఏ సందర్భంలోనూ రెండుదేశాల మధ్య వాణిజ్య అంశం ప్రస్తావనకు రాలేదు. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు’ అని కొన్ని రోజుల క్రితమే భారత్‌ తెలిపింది. అంతకుముందు కాల్పుల విరమణపై ట్రంప్‌ ప్రకటన చేసినా భారత్‌ మాత్రం ట్రంప్‌ పాత్రను ప్రస్తావించలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు