. ఎల్డబ్ల్యూఈ జాబితా నుంచి తొలగింపునకు కేంద్రం నిర్ణయం
. శాంతి పునరుద్ధరించినట్లు ప్రకటన
న్యూదిల్లీ : చత్తీస్గఢ్ రాష్ట్రం, బస్తర్ జిల్లాను నక్సల్ రహిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి బస్తర్ను తొలగించబోతోంది. బస్తర్లో మావోయిస్టుల ఏరివేత సమర్థంగా ముగిసిందని, శాంతి పునరుద్ధరించామని చెప్పుకుంటోంది. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా సాయుధ దళాలను పెద్దఎత్తున రంగంలోకి దించి ఈమధ్య వరుస ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. నిత్యం రక్తపాతం సృష్టిస్తోంది. శత్రు సేనల వలే సొంత పౌరులను చంపేస్తూ సంబరాలు చేసుకుంటోంది. గిరిజనుల పక్షాన నిలుస్తూ, అడవుల పరిరక్షణకు పాటుపడే మావోయిస్టులను బూచిగా చూపుతూ, అడవులను కార్పొరేట్లకు దారాదత్తం చేసేందుకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బస్తర్లో చారిత్రక విజయం సాధించినట్లు గొప్పగా ప్రకటించింది. ఆ జిల్లాను నక్సల్ రహిత ప్రాంతంగా నిర్ణయించింది. ఇక బస్తర్ అభివృద్ధికి ఆటంకం లేదని, రోడ్ల నిర్మాణం, విద్య, ఆరోగ్య సేవలు, పరిపాలన క్రియాశీలత ద్వారా నక్సలిజం అంతం సాధ్యమైనట్లు వర్గాలు పేర్కొన్నాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం (ఎల్డబ్ల్యూఈ) జాబితా నుంచి బస్తర్ పేరును తొలగించడంతో పెట్టుబడులు, అభివృద్ధికి నూతనోత్సాహం లభిస్తుందన్నాయి. ఉపాధి, పర్యాటక అవకాశాలు కూడా పెరుగనున్నట్లు వెల్లడిరచాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే కాలంలో శాశ్వత శాంతి, పురోగతికి దోహదమవుతుందని ఆకాంక్షించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ ‘బస్తర్లో బుల్లెట్లు, బాంబులు పేల్చిన రోజులు పోయాయి. నక్సలైట్లు ఆయుధాలు వీడాలని, జనజీవన స్రవంతిలో చేరాలని కోరుతున్నా. మీరు మా సొంత ప్రజలు. ఒక నక్సలైట్ చనిపోతే ఎవరూ సంతోషంగా ఉండరు. ఆయుధాలు పట్టడం ద్వారా మీరు మీ గిరిజన సోదరులు, సోదరీమణుల అభివృద్ధిని ఆపలేరు. అభివృద్ధి ప్రక్రియలో భాగమైన లొంగిపోయిన నక్సలైట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది’ అని అన్నారు. ‘ప్రధాని మోదీ ఐదేళ్లలో బస్తర్కు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. బస్తర్ 50 ఏళ్లుగా అభివృద్ధిని చూడలేదు. పిల్లలు పాఠశాలకు వెళ్లినప్పుడు, మండళ్లలో ఆరోగ్య సౌకర్యాలు ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్య బీమా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. ఇది బస్తర్ ప్రజలు వారి ఇళ్లను, గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలనుకుంటేనే ఇది సాధ్యం’ అని అమిత్ షా వెల్లడిరచారు.