Friday, May 30, 2025
Homeమద్యం కేసు… రంగంలోకిఈడీ

మద్యం కేసు… రంగంలోకిఈడీ

జైలులోనే కసిరెడ్డి విచారణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మద్యం కుంభకోణం కేసు విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈడీ అధికారులు బుధవారం విజయవాడ జిల్లా జైలులో ప్రధాన నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్‌ కసిరెడ్డి)ని విచారించారు. అతని వాంగ్మూలం తీసుకునేందుకు కోర్టు అనుమతి పొందారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయలను ఎలా మళ్లించారు? ఈ నగదు ఎలా, ఎప్పుడు చేతులు మారిందనే అంశాలపై ఈడీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. మంగళవారమే విజయవాడ చేరుకున్న ఈడీ బృందం… సిట్‌ అధికారుల నుంచి కేసు పూర్తి వివరాలను సేకరించారు. ఇక నుంచి ఈ కేసులో ఈడీ, సిట్‌ అధికారులు కలిసి ముందుకెళతారు. ఏ-1 రాజ్‌ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయనే దానిపై అవగాహనకు వచ్చిన అధికారులు, ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాజ్‌ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్‌ హ్యాండర్లు సేకరించిన ముడుపులు ఎన్ని దశలు దాటి ఎవరికి చేరాయనే విషయం ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురి విచారణలో తేలింది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఐదేళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన విశ్రాంత ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌ రెడ్డి, భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను సిట్‌ విచారించింది. సిట్‌ సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. మద్యం తయారీ కంపెనీల నుంచి తీసుకున్న కమీషన్లు ఎంత? ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత ఇచ్చింది? అనే వివరాలను ఈడీకి సిట్‌ అధికారులు అందించారు. ప్రమోషనల్‌ గూడ్స్‌ రూపంలో హైదరాబాద్‌, ముంబై, దిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీలాండరింగ్‌ జరిగినట్లు సిట్‌ నిర్ధారణకు రావడంతో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధ్వర్యంలో ఉమ్మడిగా దర్యాప్తు జరిపించాలని నిర్ణయించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు