వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. అవసరమైన యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యూరియా సంక్షోభం నెలకొంది. ఆగస్టు నెలలోనే సుమారు 4 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన ఇటు రా ష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కష్టాలతో రాజకీయం చేస్తున్నాయి. యూరియా కొరతకు కారణాలు చూపుతూ ఒకరిపై ఒక రు ఆరోపణలు చేసుకుంటూ ఇరు ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. ఫలితంగా యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యూరియా, ఎరువుల కొరత రాకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా 70 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొలంలో ఉండాల్సిన రైతన్నలు ప్రభుత్వ నిర్వాకం కారణంగా నేడు ఎరువుల దుకాణాల ముందు ఎదురుచూపులు చూస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.


