Homeజాతీయంబీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్

బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్

- Advertisement -

బిహార్‌ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష మహాఘటబంధన్‌ (మహాకూటమి) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఈసారి కూడా ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని స్పష్టం చేసింది. పాట్నాలోని మౌర్య హోటల్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కూటమి భాగస్వామ్య పక్షాల నేతల సమక్షంలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీహార్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ అశోక్‌ గెహ్లాట్‌ తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా, ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేశ్‌ సహానీ పేరును కూడా ఖరారు చేశారు.

డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేశ్ సహానీ పేరు ప్రకటన
తేజస్వి యాదవ్ ఒక యువ నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఆయనకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉందని మేమందరం నమ్ముతున్నాం. అందుకే ఆయన నాయకత్వంలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఏకాభిప్రాయం ఏర్పడింది, అని అశోక్‌ గెహ్లాట్‌ తెలిపారు.
సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థిత్వంపై ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య తలెత్తిన విభేదాలు కూటమి భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తించాయి. 2020 ఎన్నికల్లో కేవలం 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ ఈసారి కూడా 70 సీట్లు కావాలని పట్టుబట్టింది. అయితే, గత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని అన్ని సీట్లు ఇవ్వడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సుముఖత చూపలేదు. దీంతో కూటమిలో ప్రతిష్టంభన ఏర్పడింది.

కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యంతో వివాదానికి తెర
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ జోక్యం చేసుకుంది.
సమస్య పరిష్కార బాధ్యతను అశోక్‌ గెహ్లాట్‌కు అప్పగించింది. పాట్నాకు చేరుకున్న గెహ్లాట్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లతో విస్తృత చర్చలు జరిపారు.ఆ చర్చల ఫలితంగానే కూటమి లోపలి విభేదాలు పరిష్కారమయ్యాయని, ఇకపై ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ఆయన వెల్లడించారు.తాజా ఒప్పందం ప్రకారం ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ ప్రకటనతో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు మహాకూటమి సమగ్రంగా సిద్ధమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ పరిణామం ప్రతిపక్ష ప్రచారానికి కొత్త ఊపును తెచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు