హిందూపురంలో బాలకృష్ణ ఇంటికి భూమి పూజ
టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హిందూపురంలోని వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందుకోసం శుక్రవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సొంతింటి నిర్మాణం కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన బాలకృష్ణ.. ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమేనని ప్రకటించారు. తన తండ్రి ఎన్టీఆర్ను హిందూపురం నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని.. మూడుసార్లు ఎమ్మెల్యేని చేయడమే కాకుండా రాష్ట్రానికి సీఎంను చేశారని అన్నారు.
ఆయన వారసుడిగా తనను కూడా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిపించారన్న బాలకృష్ణ.. అందుకే హిందూపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఇక్కడే సొంతిల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. హిందూపురంలో సొంతిల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నానని.. ఇన్ని రోజులకు తన కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. హిందూపురం నియోజకవర్గా్న్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.


