న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆదివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఆ దేశాల్లోని భౌగోళిక పరిణామాలు, గగనతల పరిమితులు, భద్రత దృష్ట్యా ఆదివారం సాయంత్రం సమయానికి స్వదేశీ సంస్థలకు చెందిన 350 విమానాలు రద్దయినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకొనే విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో్ణ తెలిపింది. పశ్చిమాసియాకు వెళ్లే దాదాపు 184 అంతర్జాతీయ విమానాలను పాకిస్థాన్ రద్దు చేసింది. అటు పశ్చిమాసియా దేశాల్లోనూ 1,800కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
దుబాయ్లో చిక్కుకొన్న భారతీయులు…
ఒలింపిక్ విజేత పి.వి.సింధు, కర్ణాటకకు చెందిన జేడీ (ఎస్) ఎమ్మెల్సీ ఎస్.ఎల్.భోజేగౌడ, ఆయన కుటుంబం, బెంగాలీ నటి శుభశ్రీ గంగూలీ, ఆమె కుమారుడు, నటి సోనాల్ చౌహాన్ సహా వందలాది భారతీయులు దుబాయ్లో చిక్కుకుపోయారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సహా 700 మంది మధ్యప్రదేశ్ వాసులు యూఏఈలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పుణెలోని ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ (ఐఎస్బీఎస్)కు చెందిన 84 మంది ఎంబీఏ విద్యార్థులు సైతం దుబాయ్లో నిలిచిపోయారు.


