ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి స్పందించారు. పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో.. సీఎం జగన్ స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారని.. తనకు ముఖ్యమంత్రి చెప్పిన మాట సముచితంగా అనిపించిందన్నారు. ఒకవేళ సీఎం జగన్ తన ముందు, నందమూరి కుటుంబ సభ్యుల ముందు రెండు ఆప్షన్లు పెడితే.. జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు కావాలా.. యూనివర్శిటీ పేరు ఎన్టీఆర్ కావాలా అంటే.. తన ఆప్షన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకు కావాలని ఎంచుకుంటాను అన్నారు.. కృష్ణా జిల్లాలో యూనివర్శిటీ చిన్నది అని వ్యాఖ్యానించారు. నేటి యువతరం గతం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్నారు. ఇప్పటివారు తెలియక.. మోసం చేసినవారు చెప్పే అబద్ధాలనే నమ్ముతూ వాటినే నిజం అనుకునే ప్రమాదం ఉంది అన్నారు. ఎన్టీఆర్ను ఎంత అణగదొక్కాలని చంద్రబాబు.. అనుకూల మీడియా అనుకున్నారో.. అదే చరిత్ర తిరిగి పునరావృతం అయ్యి మరింత విజృంభిస్తోంది అన్నారు. అందుకు ప్రస్తుతం చంద్రబాబుకు జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని.. వారు చేసిన పాపాలు, వాళ్ల దుష్కర్మలను తిరిగి బయటపెట్టుకుంటున్నారు అన్నారు.లక్ష్మీపార్వతి అధికార వ్యామోహమే పార్టీని కొంపముంచిందని కొంతమంది ఆరోపించారని.. ఎన్టీఆర్ ఆరోజుల్లోనే స్టేట్మెంట్ ఇచ్చారని వివరించారు. గతంలో జరిగిన పరిణామాలను చెప్పుకొచ్చారు.