నకిలీ మద్దతు లేఖ సృష్టించారంటూ టీవీకేపై ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు తారస్థాయికి చేరాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు తమ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించిందని ఆరోపిస్తూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏఎంఎంకేకు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ మద్దతు విషయంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసి గవర్నర్కు సమర్పించిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆ పని పూర్తి చేశారు. అయితే, దినకరన్ ఆరోపణలను టీవీకే వెంటనే తిప్పికొట్టింది. కామరాజ్ స్వయంగా తమకు మద్దతు లేఖ రాస్తున్న వీడియోను విడుదల చేసి, దినకరన్కు కౌంటర్ ఇచ్చింది. దినకరన్ అనుమతితోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు కామరాజ్ ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. ఁఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వచ్ఛందంగా, సంతోషంగా మాకు మద్దతు లేఖ రాస్తున్న వీడియో ఇది. దినకరన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుఁ అని టీవీకే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము ఎవరితోనూ బేరసారాలు ఆడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ టీటీవీ దినకరన్ అనూహ్యమైన మలుపు తిప్పారు. తన ఎమ్మెల్యే కామరాజ్తో కలిసి నేరుగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామికి తమ మద్దతు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు తన ఎమ్మెల్యే కనిపించడం లేదని, రాజకీయ బేరసారాలకు గురై ఉండొచ్చని ఆరోపించిన దినకరన్, స్వయంగా ఆయన్ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్తో భేటీ అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. ఁటీవీకే ఒక నకిలీ జిరాక్స్ కాపీతో రాజకీయ లబ్ధి పొందాలని చూసింది. ఇది పూర్తిస్థాయి ఫోర్జరీ, దీనిపై క్రిమినల్ కేసు పెడతాం. మా మద్దతు ఎప్పటికీ అన్నాడీఎంకేకే. మా సీఎం అభ్యర్థి పళనిస్వామిఁ అని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు ఃమిస్సింగ్ ఎమ్మెల్యేః కథ నుండి ఃనకిలీ లేఖలః యుద్ధంగా మారాయి. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. విజయ్ తన కూటమికి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మెజారిటీకి కేవలం రెండు సీట్ల దూరంలో ఉన్నామని గవర్నర్కు నివేదించినట్లు సమాచారం. అయితే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) వంటి పార్టీల మద్దతుపై స్పష్టత రాకపోవడం, డిప్యూటీ సీఎం పదవి కోసం చర్చలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు బ్రేకులు పడినట్లు కనిపిస్తోంది.
ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మోసపూరిత ఆరోపణలు చేసుకుంటుండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ ఆర్లేకర్పై పడింది. దీంతో రాజ్ భవన్ తదుపరి చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.


