మహారాష్ట్రలో సంచలనం రేపిన టీసీఎస్ నాసిక్ కార్యాలయ లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదైన తర్వాత దాదాపు 25 రోజుల పాటు పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్పై ఇప్పుడు అధికార యంత్రాంగం దృష్టి సారించింది.ఔరంగాబాద్లోని తన నివాసంలో నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చినట్లు మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించిన నేపథ్యంలో, మతిన్ పటేల్కు చెందిన ఇల్లు, కార్యాలయాలపై కూల్చివేత చర్యలకు సిద్ధమవుతోంది.ఆయన నిర్మించిన భవనాలు అక్రమ నిర్మాణాలుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే కార్పొరేటర్కు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులకు తగిన సమాధానం రాకపోతే ఇల్లు, కార్యాలయాలను కూల్చివేస్తామని మేయర్ సమీర్ రాజూర్కార్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల ఆరోపణలు నిజమని తేలితే మతిన్ పటేల్ కార్పొరేటర్ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉందని సమాచారం.
కార్పొరేటర్ నివాసంలో దాడి.. అదుపులోకి నిదాఖాన్
ఇక నిదాఖాన్కు ఆశ్రయం కల్పించాలంటూ ఏఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ మతిన్ పటేల్పై ఒత్తిడి తెచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి సంజయ్ ఇటీవల ఆరోపించారు. నిందితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు సహాయం చేసిన వారిపైనా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కు ఆయన లేఖ రాశారు. ఈ పరిణామాల అనంతరం పోలీసులు నిదాఖాన్ ఆచూకీని గుర్తించారు. గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీనగర్లోని కార్పొరేటర్ నివాసంలో దాడి నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.


