తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన దగ్గరి నుంచి అక్కడి రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రోజులుగా వినిపిస్తున్న ప్రచారానికి అనుగుణంగా అన్నాడీఎంకేలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం ఆధ్వర్యంలో పలువురు నాయకులు అన్నాడీఎంకేకు రాజీనామా చేసి సీఎం విజయ్కు మద్దతు ప్రకటించారు. గత కొన్నేళ్లుగా పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంటుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని షణ్ముగం వెల్లడించారు.
టీవీకేకు మద్దతు
ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఏర్పాటైందని, గత 53 ఏళ్లుగా పార్టీ రాజకీయాలు అదే దిశలో సాగాయని గుర్తుచేశారు. అయితే డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రావడంతో పార్టీ అంతర్గతంగా తీవ్ర విభేదాలు తలెత్తాయని చెప్పారు. పార్టీలో మెజార్టీ సభ్యులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు వెల్లడించారు. డీఎంకేతో పొత్తు కొనసాగితే అన్నాడీఎంకే ఉనికికే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము ఎలాంటి కూటమిలో లేమని స్పష్టం చేసిన షణ్ముగం.. పార్టీని తిరిగి బలోపేతం చేయడంపైనే తమ ప్రధాన దృష్టి ఉందన్నారు. చివరికి ప్రజల మద్దతుతో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.


