దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది. దేవాలయాల బంగారు నిల్వలను ప్రభుత్వానికి అప్పగించి వాటి స్థానంలో బంగారు పత్రాలు ఇవ్వబోతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా వేదికల్లో ప్రచారం సాగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దేవాలయాల ట్రస్టులు, మతపరమైన సంస్థల బంగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ వదంతులు వ్యాపిస్తున్నాయని తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయాలు కేవలం అధికారిక ఛానళ్ల ద్వారానే ప్రకటిస్తామని స్పష్టీకరణ
ఇక ఆలయ గోపురాలు, తలుపులు, ఇతర నిర్మాణాలపై ఉన్న బంగారు పూతలను దేశ వ్యూహాత్మక బంగారు నిల్వలుగా గుర్తించబోతున్నారన్న ప్రచారాన్నీ కేంద్రం ఖండించింది. అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా వెలువడే సమాచారాన్నే విశ్వసించాలని సూచించింది. ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది.


