: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన టీవీకే ప్రభుత్వంపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం మూడు నెలల కన్నా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో గత 60 ఏళ్లలో డీఎంకే, అన్నాడీఎంకేయేతర పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. మే నెలలో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ వీసీకే ఎమ్మెల్యే పనైయూర్ బాబు, ఆయన మద్దతుదారులు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం గురించి తాను ఎక్కువగా చెప్పనవసరం లేదన్నారు. ఁవారు అధికారం చేపట్టినప్పుడు, ఆరు నెలల పాటు విమర్శించబోనని చెప్పాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు నన్ను అంతకంటే ముందే మాట్లాడమని బలవంతం చేసేలా ఉన్నాయని భయంగా ఉంది. చాలా మంది ఇప్పటికే దీనిపై మాట్లాడుతున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆరు నెలలు, ఐదు నెలలు లేదా నాలుగు నెలల ప్రశ్న కాదు. ఈ ప్రభుత్వం కనీసం మూడు నెలలు నిలుస్తుందా? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న అని స్టాలిన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మీరు డీఎంకేలో చేరారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కొత్తవారిని కోరారు.అంతేకాకుండా పార్టీలో కొత్తగా చేరిన వారు తాము గతంలో పనిచేసిన పార్టీలను విమర్శించవద్దని స్టాలిన్ హితవు పలికారు. పక్క పార్టీ తోటలోని మల్లెపూలకు కూడా సువాసన ఉంటుందని మన పార్టీ వ్యవస్థాపకులు అన్నా చెప్పారనిఁ గుర్తుచేశారు. ఎవరినీ తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం కూడా స్టాలిన్, విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ, మిత్రపక్షాల దయ వల్లే టీవీకే అధికారంలో ఉందని, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 1976లో డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత 1989 వరకు తిరిగి అధికారంలోకి రాలేకపోయిన పార్టీ చూసిన చారిత్రక ఒడిదొడుకులను ఆయన గుర్తుచేసుకున్నారు.


