Homeతెలంగాణఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లోప్రపంచ గుర్తింపు

ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లోప్రపంచ గుర్తింపు

- Advertisement -
  • పారిశ్రామికవేత్తలకు వారానికి ఒక రోజు కేటాయిస్తాం
  • పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొన్నాం
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: భట్టి

విశాలాంధ్ర – హైదరాబాద్: పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని… అది ప్రజల జీవనోపాధి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌ పో-2026’ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ… ప్రభుత్వం, పరిశ్రమల మధ్య ఎఫ్టీసీసీఐ ఒక బలమైన వారథిగా పనిచేస్తోందని అన్నారు. పారిశ్రామిక ప్రదర్శన కేవలం యంత్రాలు, ఉత్పత్తుల ప్రదర్శన మాత్రమే కాదని, ఆలోచనలు పంచుకునే ఒక అద్భుత వేదిక అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇక్కడ చిన్న వ్యాపారులకు కొత్త కస్టమర్‌లు, తయారీదారులకు సరికొత్త సాంకేతికత, స్టార్ట్‌అప్‌లకు తొలి కొనుగోలుదారులు లభించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొందని తెలిపారు. హైదరాబాద్ ఐటీ… ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. జీడీపీలో పారిశ్రామిక రంగం, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల వాటా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తయారీ రంగం కీలకమని ఆయన గుర్తుచేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న పరిశ్రమలకు, మహిళా, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు అందాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఇందుకోసం ప్రతి శుక్రవారం ఎంఎస్‌ఎంఈ సంఘాలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో చర్చల కోసం సమయం కేటాయిస్తానని ప్రకటించారు. ఈ ఎక్స్‌పోలో ఎలక్రిట్క్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధనం, రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. దేశంలో కంప్యూటర్ విప్లవానికి నాంది పలికిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్రిట్క్ వాహనాల అన్ని కేటగిరీలపై 100 శాతం రోడ్ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని, కేవలం ఈవీలను వాడటమే కాకుండా వాటి సప్లై చైన్ టెక్నాలజీని ఇక్కడే అభివృద్ధి చేయడమే మన లక్ష్యమని చెప్పారు. 2035 నాటికి తెలంగాణలో 34 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ‘పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల’ విధానాన్ని తెలంగాణ 1970ల నాడే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిందని, సాంకేతికతలో తెలంగాణ ఎపðడూ ముందే ఉంటుందని చెప్పారు. గడిచిన రెండున్నరేళ్లలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్ల నుంచి 18,500 మెగావాట్లకు పెరిగినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా పవర్ కట్స్‌ లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వ పెట్టుబడులతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పారట్నర్షిప్ (పీపీపీ) విధానాన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో తెలంగాణ ముఖచిత్రం మారబోతోందని డిప్యూటీ సీఎం తేలి చెప్పారు. పారిశ్రామికవేత్తలు, స్టార్ట్‌అప్‌లు, విద్యార్థులు ఈ ఎక్స్‌పోను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు