గాదె సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ టెర్రస్పై అనుమానాస్పద వస్తువులు వెలుగులోకి వచ్చాయి.స్టేషన్ టెర్రస్పై మరకలున్న ఓ లాఠీ, ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్తో పాటు మరికొన్ని వస్తువులను సిట్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని న్యాయాధికారి సమక్షంలో సీజ్ చేశారు.అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయికృష్ణకు చెందినవేనని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలను ప్రస్తావించినట్లు తెలిసింది.ఈ వస్తువులు స్టేషన్ టెర్రస్పైకి ఎలా వచ్చాయన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఫోరెన్సిక్, క్లూస్ బృందాలు స్టేషన్లోని ప్రతి ప్రాంతాన్ని పరిశీలించాయి. లాకప్ గదులు, గోడలపై ఉన్న మరకల నమూనాలను కూడా సేకరించాయి.శవాన్ని బయట దహనం చేసి ఉంటే ఎముకలు, బూడిదను తిరిగి స్టేషన్కు ఎందుకు తీసుకొచ్చారు? ఒకవేళ తీసుకొస్తే టెర్రస్పైనే ఎందుకు ఉంచారు? లాఠీపై ఉన్న మరకలు ఏవన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.కస్టడీలో జరిగిన దాడుల కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. అయితే ఇప్పటివరకు శవం ఆచూకీ లభించకపోవడంతో తాజా ఆధారాలు కేసులో కీలకంగా మారాయి. టెర్రస్పై లభించిన ఎముకలు, బూడిద సాయికృష్ణవేనా కాదా అన్నది డీఎన్ఏ పరీక్షతో నిర్ధారించనున్నారు. కోర్టు అనుమతితో ఆయన తల్లి విజయలక్ష్మి డీఎన్ఏ నమూనాలు సేకరించి పోల్చి చూడనున్నారు. ఈ పరీక్షల ఫలితాలతో కేసులోని కీలక ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉంది.
సాయికృష్ణ మృతి కేసులో కీలక మలుపు.. స్టేషన్పై కీలక ఆధారాలు లభ్యం!
- Advertisement -
RELATED ARTICLES


