జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం, రాష్ట్ర గీతాల ఆలాపన విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ఈ మేరకు ఈ నెల 9న ఆదేశాలు పంపింది. అధికారిక కార్యక్రమాలలో జాతీయ చిహ్నాల గౌరవాన్ని కాపాడటం, ఏకరూపతను పాటించడం కోసం ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులలో ఇప్పటికే ఉన్న ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ, కొన్ని కీలక అంశాలపై స్పష్టతనిచ్చింది.
పాటించాల్సిన ముఖ్య నిబంధనలు ఇవే..
కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ గీతం పాడేటప్పుడు లేదా దాని సంగీతం వినిపించినప్పుడు ప్రేక్షకులు తప్పనిసరిగా నిలబడి అటెన్షన్లో ఉండాలి. అయితే, వార్తా చిత్రాలు (న్యూస్రీల్స్) లేదా డాక్యుమెంటరీల ప్రదర్శన సమయంలో జాతీయ గీతం వస్తే, ప్రదర్శనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు నిలబడాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధన అయినప్పటికీ, దీన్ని మరోసారి గుర్తుచేసింది.
అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతంతో పాటు జాతీయ గేయం, జాతీయ గీతం కూడా ఆలపించాల్సి వస్తే, పాటించాల్సిన క్రమంపై హోం శాఖ స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం.. ముందుగా ఃవందేమాతరంః, ఆ తర్వాత ఃజనగణమనఃలను పూర్తిగా ఆలపించాలి. ఈ రెండు పాడడం పూర్తయ్యాక మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక రాష్ట్ర గీతాన్ని పాడాల్సి ఉంటుంది. జాతీయ గౌరవాన్ని కాపాడేందుకే ఈ ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించినట్లు కేంద్రం పేర్కొంది.
విదేశీ గీతాలపై కూడా స్పష్టత
విదేశీ ప్రముఖులు, ప్రతినిధులు హాజరయ్యే కార్యక్రమాల విషయంలోనూ ప్రోటోకాల్ను హోం శాఖ వివరించింది. గౌరవ వందనం స్వీకరించే విదేశీ అతిథి ఉన్నప్పుడు, మొదట ఆ దేశ జాతీయ గీతాన్ని పూర్తిగా ప్లే చేసి, ఆ తర్వాత భారత జాతీయ గీతాన్ని ప్లే చేయాలి. విదేశీ దౌత్య కార్యాలయాలు నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలకు కూడా ఇదే తరహా నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం జాతీయ గేయం హోదాను కలిగి ఉండగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన జాతీయ గీతంగా గుర్తింపు పొందిందని ఈ ఆదేశాల్లో మరోసారి గుర్తుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వందేమాతరం పూర్తి ఆలాపనపై ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
జాతీయ గీతం, గేయాలకు సంబంధించిన అధికారిక పాఠాలు, సరైన ఉచ్చారణ, లిపి వంటి వివరాలు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని హోం శాఖ తెలిపింది. జెండా వందనం వంటి అంశాలలో ప్రజల విచక్షణకే వదిలేస్తున్నామని, అయితే సందర్భం లేకుండా విచక్షణారహితంగా జాతీయ గీతాన్ని పాడటం లేదా ప్లే చేయడాన్ని మానుకోవాలని సూచించింది. దేశ సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, జాతీయ చిహ్నాల పట్ల గౌరవాన్ని, దేశ ప్రజలలో ఐక్యతను పెంపొందించడమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.


