ఉచితానికి సర్కారు మంగళం
- ప్రీమియం కడితేనే పంట నష్టపరిహారం
- ప్రభుత్వాల నిబంధనలతో అన్నదాతల్లో ఆందోళన
- కౌలుదారులకు శాపంగా ‘విశిష్ట గుర్తింపు సంఖ్య’
- నమోదు 24 లక్షల నుంచి 4.52 లక్షలకు పరిమితం
విశాలాంధ్ర – సచివాలయం : రాష్ట్రంలోని రైతాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద షాకిచ్చాయి. ఉచిత పంటల బీమా విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ… ఇకపై ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించే పంటలకు తమవంతు ప్రీమియం చెల్లిస్తేనే బీమా సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల కాలానికి ప్రధానమంత్రి ఫసల్ బీమాతో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు సంబంధించి జిల్లాల వారీగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఒకవైపు ‘అన్నదాత సుఖీభవ’ పథకంతో పాటు రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందిస్తూ రైతులను ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మరోవైపు వ్యవసాయానికి అత్యంత కీలకమైన పంటల బీమాలో ప్రీమియం మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం ఉచితంగా ఆదుకుంటుందని ఆశించిన రైతులకు, తాజా నిబంధనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యవసాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం… బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ బీమా పథకాన్ని వర్తింపజేసే బాధ్యతను బ్యాంకులకు అప్పగించారు. రైతులు తీసుకునే రుణం మొత్తం నుంచి వారు సాగు చేస్తున్న పంటలకు అనుగుణంగా నిర్ణీత ప్రీమియం సొమ్మును బ్యాంకర్లు నేరుగా మినహాయించుకుంటారు. అయితే, పంటల బీమా పరిధిలోకి చేరాలా లేదా అనేది పూర్తిగా రైతుల ఐచ్ఛికానికే వదిలేశారు. ఒకవేళ ఏ రైతుకైనా బీమా పథకం వద్దనుకుంటే, వారు తాము రుణం తీసుకున్న బ్యాంకు శాఖకు వెళ్లి ‘నాకు ఈ పంటల బీమా వద్దు’ అని స్పష్టం చేస్తూ ముందుగానే ఒక లిఖితపూర్వక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలా పత్రం సమర్పించిన రైతులకు మాత్రమే బ్యాంకులు ప్రీమియం సొమ్ము మినహాయింపు ఇస్తాయి. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి, రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వ అధికారిక ‘ఈ-పంట’ నమోదు సమాచారంతో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ధృవీకరిస్తారు. ఈసారి పంటల బీమా నమోదు ప్రక్రియలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య’ నిబంధన సరికొత్త వివాదానికి కారణమవుతోంది. కేంద్రం సూచించిన ఈ నిబంధన ప్రకారం విశిష్ట సంఖ్య ఉంటేనే బీమా నమోదుకు పోరట్ల్ అనుమతిస్తుంది. అయితే, రాష్ట్రంలో లక్షలాది మంది కౌలు రైతులు, అటవీ భూములు (ఆర్ఓఎఫ్ఆర్), దేవదాయ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులకు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య లభించడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనివల్ల అసలైన సాగుదారులకు బీమా రక్షణ కరువయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దిల్లీ పెద్దల నుంచి ఇంకా దీనిపై ఎటువంటి తుది ఆదేశాలు రాలేదు. ఒకవేళ కేంద్రం ఈ మినహాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే, గుర్తింపు సంఖ్యతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ పంటల బీమాకు సులువుగా నమోదు చేసుకునే భాగ్యం దక్కుతుంది. ప్రభుత్వాలు ‘ఉచిత బీమా’ విధానాన్ని రద్దు చేసి, ప్రీమియం భారాన్ని రైతులపై నెట్టడం వల్ల పంటల బీమా నమోదు ఏ స్థాయిలో పడిపోయిందో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలకు 2024-26 రెండేళ్ల కాలానికి గాను బీమా అమలు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అయితే, 2024 ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే ఉచిత బీమాను అమలు చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన రబీ సీజన్ నుంచి ఉచిత విధానాన్ని పూర్తిగా ఎత్తేసింది. ఫలితంగా, ఉచిత బీమా అందుబాటులో ఉన్న 2024 ఖరీఫ్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 24 లక్షల మంది రైతులు తమ పంటలను నమోదు చేసుకోగా.. ప్రీమియం డబ్బులు సొంతంగా కట్టాలనే నిబంధన రావడంతో తదుపరి ఏడాది 2025 ఖరీఫ్ నాటికి ఆ సంఖ్య ఏకంగా 4.52 లక్షలకు పడిపోయింది. ఇక వాతావరణ ఆధారిత బీమా చేయించుకున్న రైతుల సంఖ్య గతంలో ఉన్న 8 లక్షల నుంచి ఏకంగా 15 వేలకే పరిమితమైంది. గత రెండు సంవత్సరాల కాలంలో ‘ఫసల్ బీమా’ కింద నమోదైన వివరాలను పరిశీలిస్తే, 2024 ఖరీఫ్లో అత్యధికంగా 24.05 లక్షల మంది రైతులు తమ పంటలకు బీమా రక్షణ కల్పించుకున్నారు. ఈ సీజన్కు మొత్తం ప్రీమియం రూ. 356 కోట్లు కాగా, రూ.20.41 కోట్ల క్లెయిమ్ల పరిహారం విడుదలైంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.13 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. 2024 రబీ సీజన్లో 2.91 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా, రూ. 194 కోట్ల ప్రీమియం చెల్లించినప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదు. 2025లో బీమా చేయించుకున్న రైతుల సంఖ్య 4.52 లక్షలుగా ఉంది. వీరు చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 38 కోట్లు కాగా, రూ. 99 లక్షల మేర పరిహారం అందింది. తద్వారా కేవలం 848 మంది రైతులు మాత్రమే ప్రయోజనం పొందారు. అయితే, 2025 రబీ సీజన్కు సంబంధించిన అన్ని రకాల డేటా ప్రస్తుతం శూన్యంగా నమోదైంది. వాతావరణ ఆధారిత పంట బీమా వివరాలను గమనిస్తే… 2024 ఖరీఫ్ సీజన్లో 8 లక్షల మంది రైతులు బీమా నమోదు చేసుకున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా రూ.740 కోట్ల భారీ ప్రీమియం సమకూరగా, రైతులకు అందిన క్లెయిమ్ల పరిహారం రూ. 144.20 కోట్లుగా నమోదైంది. దీని ద్వారా మొత్తం 4.67 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కానీ, 2024 రబీ సీజన్కు వచ్చేసరికి బీమా నమోదు కేవలం 15 వేల రైతులకు పరిమితమైంది, దీని ప్రీమియం రూ. 20 కోట్లుగా ఉన్నప్పటికీ క్లెయిమ్ల రూపంలో ఎటువంటి పరిహారమూ అందలేదు. 2025 ఖరీఫ్లో మళ్లీ పుంజుకుని 3.04 లక్షల మంది రైతులు వాతావరణ బీమా పరిధిలోకి రాగా, దీని మొత్తం ప్రీమియం రూ. 419 కోట్లుగా నమోదైంది. ఈ సీజన్ పరిహారాల పంపిణీ జరగాల్సి ఉంది. 2025 రబీ వాతావరణ బీమా వివరాలు కూడా పూర్తిగా నిల్గా ఉన్నాయి. పంటల బీమా పథకం కింద అర్హులైన రైతులు జిల్లాల వారీగా నిర్దేశిత గడువులోగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించరు. ఖరీఫ్ సీజన్ ప్రధాన పంట వరి సాగుకు ఆగస్టు 15 వరకు గడువు ఇవ్వగా, ఇతర రకాల నోటిఫైడ్ పంటలకు జులై 31 లోగా నమోదు పూర్తి కావాలి. ఖరీఫ్ వాతావరణ బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద నోటిఫై చేసిన అన్ని రకాల పంటలకు జులై 15 లోపు మాత్రమే గడువు ఉంటుంది. రబీ సీజన్ వరి పంటకు డిసెంబర్ 31 వరకు సమయం ఉండగా, ఇతర అన్ని రకాల నోటిఫైడ్ పంటలకు డిసెంబర్ 15 లోగా నమోదు చేసుకోవాలి. రబీ వాతావరణ బీమా తోట పంటలైన జీడిమామిడికి నవంబర్ 15 వరకు, అలాగే టమాటా పంటకు డిసెంబర్ 15 లోగా నమోదు ప్రక్రియ ముగించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పాత జిల్లాల ప్రాతిపదికన (నూతన జిల్లాలను కలుపుకుంటూ) బీమా అమలు బాధ్యతలను విభజించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం సంస్థలు సెంట్రల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం, నంద్యాల, గుంటూరు, వైఎస్సార్ కడప, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాలు, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ చిత్తూరు, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి, కర్నూలు, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, బాపట్ల జిల్లాలు, ఐసీఐసీఐ లాంబార్డ్ అన్నమయ్య, ప్రకాశం, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే సవరించిన వాతావరణ ఆధారిత బీమా సంస్థలు ఇండన్ లాండ్ ఇన్సూరెన్స్, ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్: అనంతపురం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, నంద్యాల, బాపట్ల, అనకాపల్లి, ప్రకాశం, ఏలూరు, కర్నూలు, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ, వైఎస్సార్ కడప, అన్నమయ్య, విజయనగరం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, తిరుపతి, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వాతావరణ బీమా సేవలను అందిస్తాయి. మారిన నిబంధనలు ఒకవైపు నమోదు సంఖ్యను భారీగా తగ్గించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సామాన్య రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చేలా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాత పద్ధతిలోనే ఉచిత బీమాను పునరుద్ధరించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.


