కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండియన్ ఆదేశించారు.గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.మంగళవారం డీసీహెచ్ చక్రధరబాబు, డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, ప్రజారోగ్య శాఖ, ఏపీఎంఎస్ఐడీసీతో పాటు ఇతర విభాగాల అధికారులతో ఆయన వర్చువల్ సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 26 కరోనా కేసులు
రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.వీటిలో గుంటూరు జిల్లాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, బాపట్ల జిల్లాలో ఒక కేసు నమోదైంది.ఇప్పటివరకు మొత్తం 145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా,వారిలో 26 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.గుంటూరు జిల్లాలో ఆరు, తూర్పుగోదావరి జిల్లాలో మూడు, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండు చొప్పున కేసులు గుర్తించారు.
పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.ఇప్పటివరకు కరోనా కారణంగా నలుగురు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.ప్రస్తుతం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో తొమ్మిది మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.ముగ్గురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరణించిన నలుగురికీ కరోనా నిర్ధారణకు ముందే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.


