విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఉరవకొండ పీఏసీఎస్ చైర్మన్ ప్యారం కేశవానంద అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో ఉరవకొండ సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత లేకుండా, అందుబాటు ధరల్లో ఎరువులు లభించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రైతులకు నేరుగా అవసరమైన ఎరువులు అందించాలనే ఉద్దేశంతో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విక్రయ
కేంద్రంలో 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350కు, 50 కిలోల యూరియా బస్తా రూ.266కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సహకార బ్యాంకు ద్వారా ఎరువులు పొందాలని కోరారు. రైతులకు ఎరువులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల రైతుల్లో సానుకూల స్పందన ఉందన్నారు. ముఖ్యంగా మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సహకార బ్యాంకు డైరెక్టర్లు నాగేంద్రప్ప, నాగ ప్రమీల, సహకార బ్యాంకు కార్యదర్శి మహమ్మద్ గౌస్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రామాంజనేయులు, టీడీపీ నాయకులు రామాంజనేయులు, సుంకన్న, పెద్దన్న, గోవిందు, సహకార బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులోకి ఎరువులు.. సహకార బ్యాంకు ఆధ్వర్యంలో విక్రయ కేంద్రం
- Advertisement -


