విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా):ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచి, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం, జేకేసీ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. శైలజారాణి అధ్యక్షత వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, 2023 ఆగస్టు 23న భారత్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేసి చారిత్రాత్మక ఘనత సాధించిందని వివరించారు.
కార్యక్రమాన్ని కంప్యూటర్ అప్లికేషన్స్ లెక్చరర్ ఎం. సుధాకర్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఎం. మృత్యుంజయ ఇస్రో అభివృద్ధి, విజయాలు, భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం ప్రగతిని విద్యార్థులకు వివరించారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. మస్తానప్ప, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాసినేని సుధాకర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని విద్యార్థులందరూ వీక్షించి పాల్గొనాలని సూచించారు.
కార్యక్రమంలో డా. బి. వెంకటరాముడు, సోము, నారాయణస్వామి, కిరణ్, వెంకటేశులు తదితర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర, జాతీయ అంతరిక్ష దినోత్సవం
- Advertisement -
RELATED ARTICLES


