75 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, ఒక కారు, అక్రమంగా నిల్వ ఉంచిన క్రాకర్స్ సీజ్… జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట్ల, లక్ష్మీ చెన్నకేశవ పురం, మహాత్మా గాంధీ కాలనీల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో విస్తృత కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.రానున్న గణేష్ ఉత్సవాలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు, పాత నేరస్తుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ధర్మవరం డీఎస్పీ జగన్నాథ్ రాజు తో పాటు ఐదుగురు సీఐలు, ఎస్ఐలు, మొత్తం 102 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్లను, అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేసి గంజాయి, అక్రమ మద్యం, అక్రమంగా నిల్వ ఉంచిన క్రాకర్స్ తదితరాల కోసం తనిఖీలు నిర్వహించారు.సరైన పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, ఒక కారు, అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన క్రాకర్స్ను పోలీసులు సీజ్ చేశారు.చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించిన వారికి నిబంధనల మేరకు వాహనాలను తిరిగి అప్పగిస్తామని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
రౌడీషీటర్లు, సస్పెక్ట్షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్;; ధర్మవరం ప్రాంతాల్లోని 13 మంది రౌడీషీటర్లు, ఆరుగురు సస్పెక్ట్షీటర్ల ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా వారితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మంచి ప్రవర్తనతో నేరాలకు దూరంగా ఉంటే నిబంధనల మేరకు రౌడీషీట్ తొలగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
కొత్త వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్ తదితర గుర్తింపు పత్రాలను పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద లేదా నేర కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.వాహన చోరీలను అరికట్టేందుకు ముఖ్యంగా నంబర్ ప్లేట్లు, నేమ్ బోర్డులు లేని ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.


