: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల మోతపై రేవంత్ను నిలదీసిన కవిత
ప్రైవేట్ స్కూళ్లు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయని కవిత ఆగ్రహం
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా సాగుతున్న ఫీజుల దోపిడీపై కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్కూల్ ఫీ రెగ్యులేటరీ కమిషన్ను తీసుకొస్తామని గతంలో ఇచ్చిన హామీ ఏమైందని, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు రెండేళ్లుగా కేబినెట్ దాటి బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. స్వయంగా విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి… పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులు గుల్లవుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.ప్రభుత్వ భూముల్లో నడిచే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సైతం ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచినా సర్కార్ మౌనంగా ఉండటం కార్పొరేట్ విద్యా వ్యాపారులకు బాసటగా నిలవడమేనని కవిత ఆరోపించారు. 1994 నాటి జీవో ప్రకారం వార్షిక ఫీజుల పెంపు 5 శాతానికి మించకూడదన్న స్పష్టమైన నిబంధన ఉన్నా దానిని పక్కనబెట్టి, విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాబోయే శాసనసభ సమావేశాల్లోనే తక్షణమే పాఠశాల ఫీజుల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని, లేనిపక్షంలో బాధితులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అది విద్యా వ్యవస్థా లేక కార్పొరేట్ దోపిడీ వ్యవస్థా?
- Advertisement -


