పది మందికి పైగా మృతి.. 260 మందికి పైగా గాయాలు
ఖుల్మ్ సమీపంలో భూకంప కేంద్రం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదు
ఆఫ్ఘనిస్థాన్ ను పెను భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. మజార్ ఏ షరీఫ్ నగరంతో పాటు చుట్టుపక్కల బీభత్సం సృష్టించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 పాయింట్లుగా నమోదైంది. భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు పదిమందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 260 మందికి పైగా గాయపడ్డారని వివరించారు. కూలిన ఇళ్ల శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఖుల్మ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. ఖుల్మ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 28 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. దీంతో సమీప ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


