సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది. పాశమైలారంలో ఉండే సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ఒక్కసారిగా పేలింది. రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి సుమారు 100 మీటర్ల దూరంలో పడ్డారు.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్లలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 30 మంది కార్మికులు విధులలో ఉన్నారు.
ప్రమాద తీవ్రత ఎక్కువుగా ఉండటంతో , కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఘాటైన వాయివులు వస్తుండటంతో పోలీసులు చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి ఎవరు రావద్దని సూచించారు.. కాగా , విషయం తెలిసిన వెంటనే సంగారెడ్డి కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు.. స్వయంగా వారిద్దరూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.


