Wednesday, February 5, 2025
Home Blog Page 138

అత్యాచారాలపై మాటలయుద్ధం

. పరస్పర విమర్శలతో హోరెత్తిన మండలి
. వైసీపీ సభ్యులపై హోంమంత్రి ఆగ్రహం
. మంత్రి తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై సాగుతున్న అత్యాచారాలు, హత్యల అంశంపై శాసనమండలి దద్దరిల్లింది. మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పరస్పర విమర్శల దాడికి దిగారు. మంత్రులు జవాబులిచ్చే సమయంలో వైసీపీ సభ్యులు అడ్డు తగులుతూ… ఉప ప్రశ్నలు వేశారు. అలాగే వైసీపీ సభ్యులు మాట్లాడుతున్న ప్పుడు కూటమి సభ్యులు అడ్డుతగిలారు. హోంమంత్రి అడిగిన ప్రశ్నలకు సమా ధానాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారని వైసీపీ అభ్యంతరం తెలిపింది. తొలుత మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు అంశంపై వైసీపీ సభ్యులు వరుదు కల్యాణి, టి.కల్పలత, చంద్రగిరి ఏసురత్నం ప్రశ్నలు అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, మహిళలు, ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దిశ చట్టాన్ని, యాప్‌ను నిర్వీర్యం చేయడంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యత: హోంమంత్రి అనిత
ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ హయాంలో క్రైమ్‌ రేటు తగ్గిందని, అత్యాచార ఘటన లను రాజకీయ చేయొద్దని సూచించారు. నిర్భయ చట్టాన్ని పక్కన పెట్టి గత ప్రభు త్వంలో దిశ చట్టం తెచ్చారని, మహిళలపై అత్యాచారాలు జరిగినా పట్టించుకోలేదని, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టిందన్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారని, అసలు దిశ చట్టం ఉందా.? గంజాయిపై ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా ?, అంటూ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. జగన్‌ తల్లి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటామని ఆమె వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా వైసీపీ సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి…నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, బాధ్యతాయుత హోంమంత్రి అనిత సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు హోం మంత్రి స్పష్టంగా సమాధానం ఇవ్వని కారణంగా… ఆ ప్రశ్న వరకు సభ్యులు వాకౌట్‌ చేశారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మంత్రి మాటలను బొత్స వక్రీకరించారన్నారు. అనంతరం కర్నూలుజిల్లాలో కృష్ణానదిపై వంతెన నిర్మాణ అంశంపై సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నలకు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లేదని బదులిచ్చారు. అంగన్‌వాడీ భవనాలు, బాలల సంజీవని పథకం అంశాలపై సభ్యులు వంకా రవీంద్రకుమార్‌, టి.కల్పలత అడిగిన ప్రశ్నలకు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,977 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని, జనవరి, 2024 నుంచి ఇప్పటి వరకు రూ.32.64 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మూత్రశాలలు లేకుండా 2,941 అద్దె భవనాలున్నాయని, సాధ్యమైన చోట్ల మరుగు దొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని, అన్ని వసతులున్న వేరే భవనాలకు వాటిని మార్చుతున్నట్లు వివరించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గృహ విద్యుత్‌ వినియోదారులపై అదనపు భారం అంశంపై సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వివరణ ఇచ్చారు. 2019` 2024 మధ్య కాలంలో గృహ వినియోగదారులపై టారిఫ్‌ నిమిత్తం మొత్తం రూ.1769.92 కోట్ల అదనపు భారం ఉందని, దాంతోపాటు ట్రూ ఆప్‌ ఎఫ్‌పీసీఏ చార్జీల నిమిత్తం రూ.5,851.82 కోట్లను విధించారన్నారు. ఇమామ్‌, మౌజమ్‌లకు గౌరవ వేతనంపై సభ్యులు ఇసాక్‌ బాషా, మహ్మద్‌ రుహుల్లా అడిగిన ప్రశ్నలకు మైనార్టీశాఖ మంత్రి ఫరూక్‌ అబ్దులా సమాధానమిస్తూ, ఇమామ్‌, మౌజమ్‌ లకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉందన్నారు. కాగా వైసీపీ సభ్యులు తమ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని నిరసనకు దిగారు. దీంతో రాత పూర్వకంగా పంపాలని మంత్రికి చైర్మన్‌ సూచించారు. జాబ్‌ క్యాలెండర్‌, కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల నుండి నిధుల మళ్లింపు, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు, రాష్ట్రంలో వయోజన విద్యా కేంద్రాలు అనే నాలుగు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పినట్లుగా శాసన మండలి చైర్మన్‌ ప్రకటించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన అనేక బిల్లులను మండలి ఆమోదించినట్లు వెల్లడిరచారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సవరణ బిల్లు, ఏపీ విద్యుత్‌ రెండో సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ తాత్కాలిక బిల్లులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం శాసనమండలిని మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.

రాజోనాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారా?

. రెండు వారాల్లో తెలియజేయండి
. రాష్ట్రపతిని కోరిన సుప్రీం

న్యూదిల్లీ: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్‌ సింగ్‌ రాజోనా క్షమాభిక్ష అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. అతడి పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని ఆమె కార్యదర్శిని ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా నిర్ణయం తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం రాష్ట్రపతిని అభ్యర్థించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా 1995లో చండీగఢ్‌ సచివాలయం ముందు జరిగిన పేలుడులో అప్పటి పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌ సింగ్‌ రాజోనా ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. రెండు దశాబ్దాలకు పైగా రాజోనా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ 2012లో రాజోనా కేంద్రాన్ని ఆశ్రయించాడు. అప్పటినుంచి అతడి పిటిషన్‌ పెండిరగ్‌లోనే ఉంది. తన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించాలని కోరుతూ 2020లో రాజోనా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం… మరణశిక్షను జీవితఖైదుగా మార్చలేమని గతేడాది మే నెలలో తేల్చిచెప్పింది. అయితే, అతడి క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.

ప్రచారానికి తెర

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికలకు అంతా సిద్ధం

ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. నవంబరు 20న మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు జార్ఖండ్‌లో రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 288 స్థానాలకుగాను మొత్తం 4,136 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ఎదురు దెబ్బ తగలడం… ఎంవీఏ కూటమి పుంజుకున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార, విపక్ష కూటములు ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నెలబెట్టింది. విపక్ష కూటమి మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) లో కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన (యూబీటీ) శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఉన్నాయి. కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలపగా… శివసేన (యూబీటీ)95 మందిని, ఎన్సీపీ (ఎస్పీ) 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటు కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.
జార్ఖండ్‌లో…
జార్ఖండ్‌లోని 38 నియోజకవర్గాల్లో వవంబరు 20న పోలింగ్‌ జరగనుంది. 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్‌కు ఈసీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ని కలు జరగనున్న దృష్ట్యా భారీగా బలగా లను మోహరిస్తోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉండగా… వాటిలో తొలి విడతలో ఈనెల 13న 43 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 43 స్థానాలకు 683 మంది అభ్యర్థులు పోటీపడగా… 66.18 శాతం పోలింగ్‌ నమోదైంది. జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘట్‌ బంధన్‌గా పోటీ చేస్తుండగా, బీజేపీ, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌, జేడీయూ, లోక్‌జన్‌ శక్తి రామ్‌ విలాస్‌ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి.

కార్పొరేట్ల అమానవీయత

0

గినీ జార్జి

పనిచేసే చోట విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కార్పొరేట్‌ యజమానులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. 26ఏళ్ల యువతి అన్నా సెబాస్టియిన్‌ పెరయిల్‌ పనిఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తోటి పనివాళ్లు, ఉద్యోగులు తీవ్రంగా స్పందించారు. అన్నా సెబాస్టియిన్‌ పెరయిల్‌ సీఏ పరీక్షలు 2023లో పాస్‌ అయిన తర్వాత ఉద్యోగం కోసం వెదికారు. ఆమె డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. 2024 మార్చిలో ఈవై ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరారు. నాలుగునెలలపాటు ఉద్యోగం చేసిన తర్వాత జులై 20న ఫ్యాక్టరీలో పనిచేసిన అనంతరం ఇంటికి తిరిగివచ్చారు. అయితే ఆలస్యంగా ఇంటికివచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. అన్నా తల్లి అగస్టిన్‌ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా(ఈవై) చైర్మన్‌కి ఒక లేఖ రాశారు. మితిమీరిన పనితో తీవ్ర ఒత్తిడికిగురై తన కుమార్తె చనిపోయారని సంస్థ నుంచి కనీసం ఒక్కరు కూడా అన్నా అంత్యక్రియలకు హాజరు కాలేదని ఆ లేఖలో నిరసన తెలియజేశారు. ఆ లేఖ వైరల్‌ అయింది. కార్మికులలో, ప్రజలలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ఈ విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం అనే సంస్కృతిని పెట్టుబడిదారులు చిరకాలంగా పెంపొందించారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పెద్దగా ఆందోళన ఏమీ జరగకుండా నియంత్రించడం, తక్కిన కార్మికులను, ఉద్యోగులను బెదిరించడం పెట్టుబడిదారులకు బాగా అలవాటైంది. పనిగంటలను పెంచి ఒత్తిడికి గురిచేయడమనేది సర్వసాధారణమైనది. ఇలాంటి పరిస్థితులను కల్పించడం ఏ మాత్రం సరైన విధానం కాదు. అయినప్పటికీ యాజమాన్యం అదనంగా కొన్ని గంటలు పనిచేయించడానికి వెనుకాడడంలేదు. నిర్ణీత గడువు లోపల ఇంటికి వెళ్లడానికి ఆటంకాలు కల్పిస్తారు. ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కోసం ఉన్నతస్థాయి యాజమాన్యం కావాలనే మధ్య, దిగువ మేనేజిమెంటు సిబ్బందికి స్వేచ్ఛనిస్తారు. ఏ విధంగానైనా లక్ష్యం నెరవేరేట్లు చేయాలని ఆజ్ఞాపిస్తారు. పనిచేసేచోట దుష్ప్రవర్తన, హింసించడం వంటి చర్యలకు పాల్పడతారు. ఇవన్నీ లోలోపల అణిగిపోయేట్లు చూస్తారు. వీటిని పరిశీలించే అధికారులకు తెలియకుండా జాగ్రత్తపడతారు. ఇటీవల ఎకనామిక్‌ టైమ్స్‌లో వాణిజ్య బాధ్యత, సుస్థిరతపైన సమాచారాన్ని ప్రచురించారు. 1062 లిస్టెడ్‌ కంపెనీలకు 940 కంపెనీలు తమ ఉద్యోగులలో అనారోగ్యం, అభద్రత ఏమీలేవని ప్రకటించాయి. అయితే తమకు జరుగుతున్న ఇబ్బందులను, కలుగుతున్న అసౌకర్యాలను ఉద్యోగులు బైటకు చెప్పడంలేదని నిపుణులు తెలియజేశారు. అంతేకాదు, కంపెనీలలో జరిగే వాటి విషయంలో ఏ మాత్రం పారదర్శకత ఉండదు. ఈ విషయాలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. పని ప్రదేశాలలో ఒత్తిడి, ఆందోళన ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. లేఆఫ్‌లు, కార్మికుల పట్ల సానుభూతి ఉండటంలేదనేది ఆందోళన. పనిగంటల అక్రమాలు, పని సమతుల్యత లేకపోవడం, కులం, ప్రాంతం, మతం లాంటి వివక్షత, మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడం తదితర ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి.
లేఆఫ్‌ల భయం:
గత రెండు సంవత్సరాల కాలంలో లక్షన్నరమంది ఉద్యోగులు లే ఆఫ్‌లను ఎదుర్కొన్నారు. అనేక పత్రికల్లో ఈ సమాచారం ప్రచురణ అయింది. దేశంలోఉన్న ఉద్యోగ ధోరణులు పత్రికా వ్యాసాలలో వస్తూనే ఉన్నాయి. నిర్దిష్టమైన పరిశ్రమలలో పరిస్థితి వెల్లడికావడం, ప్రభుత్వ కార్మిక గణాంకాల ద్వారా లేఆఫ్‌ల పరిస్థితి తెలుస్తుంది. లేఆఫ్‌లకు ఆందోళన చెందుతూ అన్ని ఇబ్బందులను సర్దుకుపోతూ ఉన్నారు. వివిధ ఫ్యాక్టరీలు, కంపెనీలలో అక్రమ కార్యకలాపాలను బైటకు పొక్కకుండా కార్మికులు చూడకపోతే చాలా ఎక్కువగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నారు. ఫ్యాక్టరీలలో యూనియన్లు ఏర్పాటుకాకుండా యాజమాన్యం రకరకాల ఎత్తుగడలు వేస్తాయి. కొంతమంది కార్మికులను తొలగించినప్పటికీ ఇతర కార్మికులు ఏమాత్రం సానుభూతిని తెలియజేయడంలేదు. అందుకు యాజమాన్యం ఆటంకపరుస్తుంది. యాజమాన్యం తీసుకున్న ఇలాంటి చర్యలను నిలిపివేయడానికి కార్మికులు ఉమ్మడిగా ఆందోళనచేయడం లేదా ఇతర విధాలైన చర్యలు చేపట్టడానికి ముందుకు రావడంలేదు. అంతేకాదు, సమతుల్యమైన కార్మిక జీవనం, ఉద్యోగుల సంక్షేమం లాంటివి యాజమాన్యం పట్టించుకోదు. ప్రతి కార్మికుడు ఇతర కార్మికుల పట్ల సంఫీుభావం తెలియజేయడానికి కూడా రకరకాల ఆటంకాలు కల్పిస్తారు.
ఎనిమిది గంటల పని:
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 8గంటల పని విధానాన్ని నిర్ణయించారు. వారానికి 40గంటల పనిదినాలుగా నిర్ధారించారు. ఇది చట్టబద్దమైన నిర్ణయం. రోజులో ఎనిమిదిగంటల పని, మరో ఎనిమిది గంటల విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించారు. అయితే ప్రస్తుతం పెట్టుబడిదారులు కార్పొరేట్ల అనుకూల నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టాలను మార్పు చేస్తోంది. రోజులో కనీసం 9గంటల నుంచి 12 గంటల వరకు పనిచేయాలని వారంలో 45గంటలు పనిచేయాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన కార్మిక చట్టాలను సవరించారు. కులం, ప్రాంతం, మతం, వివక్ష దేశంలో చాలా ఎక్కువగా ఉంది. కులం అనేది పనిప్రదేశాల్లో అత్యధికంగా కనిపిస్త్తోంది. అణగారిన వర్గాల కార్మికుల పట్ల వివక్ష గాఢంగా ఉంది. వీరికి అవకాశాలు తగ్గుతాయి. అంతేకాదు, పనిచేసేచోట వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. ఎక్కువగా ప్రయోజనంలేని ప్రాంతాల కార్మికులు సైతం వివక్షను ఎదుర్కోవలసివస్తుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా మానసిక ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. కులం, ప్రాంతం ఆధారంగా ఉండే కార్మికులు సమైక్యంగా ఉండరు. తరచుగా విభేదాలను ఎదుర్కొంటారు. భారతదేశంలో భిన్నమైన వర్గాలకు చెందిన ప్రజలలో ఇప్పటికీ మతం తదితరవాటి ఆధారంగా వివక్ష పెరుగుతోంది.
భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై బహిరంగంగా చర్చించడానికి వెనుకాడతారు. ఒత్తిడి, మానసిక ఆందోళన ఉన్నప్పటికీ వాటిని బైటపెట్టరు. మానసిక అనారోగ్యంపై సమాజంలో అదొక రుగ్మతగా గుసగుసలాడుతుంటారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారాన్నికూడా చూపలేరు. కులం, ప్రాంతం, మతం లాంటివాటిని తొలగించడానికి ప్రభుత్వం ఇంతవరకు గణనీయమైన చర్యలను చేపట్టనేలేదు.

సేవ్‌ ది హౌజ్‌

0

చింతపట్ల సుదర్శన్‌

అరుగు మీద మంచి నిద్రలో ఉన్న డాగీకి మనుషుల అలికిడి వినిపించి మెలకువ వచ్చింది. ఈ డాంకీ ఇంకా రాలేదు ఎక్కడ న్యూస్‌ పేపర్లు నవుల్తూ ఉండిపోయిందో అనుకుంటూ ఇంటి లోపలికి తొంగిచూసింది. లోపల ఓ పీచు గడ్డంవాడు, ఓ పిల్లి మీసాలోడూ, ఓ బట్ట గుండోడు ఉన్నారు. ఎవరు వీళ్లు? ఎందుకు ఈ కొంపలోకి జొరబడ్డారు? పెద్దగా అరిస్తే అటునుంచటే పారిపోతారా లేదా దుడ్డుకర్ర ఏదైనా తీసుకుని మీదికి వస్తారా? చూస్తే ‘అన్‌ సోషల్‌ ఎలిమెంట్స్‌’ లాగున్నారు. ఎందుకైనా మంచిది డాంకీ వచ్చేదాకా ఆగుదాం అనుకున్న డాగీకి అరుగు ఎక్కుతున్న డాంకీ కనిపించింది. వచ్చావా! వందేళ్లు నీకు అందామనుకుంది కాని అది అత్యాశపరులైన మనుషులకే కాని తమకు కాదుకదా అని గుర్తొచ్చి, రారా డాంకీ భాయ్‌ నీ కోసమే వెయిటింగిక్కడ అంది. ఏమిటి సంగతి ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే తప్ప గుర్తు చెయ్యవు కదా నన్ను, పైగా వెయిటింగు కూడానా? అంది డాంకీ. పంచ్‌లు పంచుకునే టైం కాదిది. ఎమర్జెన్సీ! లోపల ముగ్గురు మనుషులున్నారు. ముగ్గురా? ముగ్గురు మూర్ఖులా, ముగ్గురు బైరాగులా, మాయల మరాటీలా లేక ఊళ్లల్లోకి వచ్చి ‘రీల్సు’ చేస్తున్న అఘోరాలా? అంది డాంకీ గోడకు వీపు ఆనించి ‘సిట్టింగ్‌’ వెయ్యబోతూ. ప్రతిదీ ‘లైట్‌’ తీసుకోడం అంత మంచిది కాదు. లోపల ముగ్గురు దొంగనాయాళ్లున్నారు. మన ఈ కూలిన కొంప మన స్వంతం. మన కొంపలోకి వచ్చిన పరాయి ముష్కరులను చూస్తూ ఊరుకుందామా? ఏమైనా చేద్దామా? ఐసీ! మ్యాటర్‌ సీరియస్‌ అన్నమాట. ఇంతకీ లోపల ఏం చేస్తున్నట్టు వాళ్లు పేకాడుతున్నారా? గంజాయి, దమ్ము కొడుతున్నారా? మెళ్లల్లో కండువాలు ఉన్నయా? ఏ పార్టీ కార్యకర్తలో గమనించావా? అంది డాంకీ. సరిగ్గా చూడలేదు కానీ, అన్ని పార్టీల్లోనూ కార్యకర్తలుగా ఇలాంటి వారే కనబడతారు. ప్రజాస్వామ్యాన్ని పీచుగడ్డంవాళ్లూ, పిల్లి మీసాల వాళ్లూ, బట్ట గుండోళ్లే కద కాపాడాల్సింది. వీళ్లు కాక ప్రభుత్వ అధికారుల మీద రాళ్లు రువ్వగలిగిన వాళ్లు, కార్లు ధ్వంసం చేయగలిగిన వాళ్లు ఎవరుంటారు చెప్పు. ఇక వీళ్లు ఏం చేస్తున్నారో చూసి చెప్తా అంది డాగీ లోపలికి దృష్టి సారించి. చూడకుండానే నేను చెప్పనా ఇక్కడెక్కడో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఓటుకు ఇంత అని అమ్ముకుని ఆ డబ్బుతో మందు తెచ్చుకుని ‘మజా’ చేసుకుంటున్నారు అంతేకదా! ఎగ్జాట్లీ ఎలా చెప్పగలిగావు అంది డాగీ. ఏముంది! ప్రజాస్వామ్యం ఇప్పుడు సూపర్‌ మార్కెట్‌ సరుకు అయింది కదా. వేలు మీద చుక్క పెట్టించుకోవడం అనే పెట్టుబడి కాని పెట్టుబడితో డబ్బు సంపాదిస్తున్నారు ఓటర్లు. ఎలాగూ గెలిచినవాడు ఊడబొడిచేది ఏమీ ఉండదని, ఓడినవాడు, గెలిచినవాడు ఒకళ్లనొకళ్లు బూతులు తిట్టుకుంటూ మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా, కాలక్షేపం చేస్తారని తెలిసిందే కద అంది డాంకీ. కాలక్షేపం, దుష్ప్రచారం సరే గెలిచిన వారయితే ప్రజల నెత్తిన ‘అప్పు తట్ట’ బోర్లించి రాజ భోగాలయితే అనుభవిస్తారు కదా! అనుభవిస్తారు కానయితే అవి రాజభోగాలు కావు మంత్రి భోగాలు, ఎంపీ, ఎంఎల్‌ఏ భోగాలే. సొమ్మొకడిది సోకొకడిది అనే కదా అంది డాంకీ.
ఓటుకు నోటూ, మందూ పుచ్చుకునే వాళ్లు కొందరయితే, క్యూల్లో నిలబడి, చెమటోడ్చి ఓటు వెయ్యడం అవసరమా అనుకునే వాళ్లు కొందరు. ప్రజల్ని మతం పేరా, కులం పేరా విభజించి, విడదీసి వీరంగం ఆడేస్తున్నారు నాయకులు అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. వచ్చావా బ్రో! రారా! ఇక్కడ ఓ పెద్ద సమస్య వచ్చిపడిరది అంది డాగీ. సమస్యా! అది లేకుండా భూ ప్రపంచమే ఉండదులే! మణిపూర్‌ సమస్య మళ్లీ భగ్గుమన్నది. పాపం మూడేళ్ల పసివాడి తల, చేతులు నరికేశారుట, వాడి కుటుంబం మొత్తాన్ని శవాలుగా మార్చేర్ట. అయినా ఆనాడూ ఈనాడూ చీమ కుట్టనే లేదు మన సర్కారును. అన్ని సమస్యల్నీ ‘లైట్‌’ గా తీసుకోడం అలవాటయ్యి, నాన్చడం అలవాటయ్యి, రైతుల సమస్యలయితేనేం, జాతుల సమస్యలయితేనేం, పహిల్వాన్ల సమస్యలయితేనేం అన్ని సమస్యలనీ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడమే దేశభక్తి అంటున్నారు. సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుందని నమ్మే ఆధ్యాత్మికవేత్తల దేశం మనది మరి అన్నాడబ్బాయి.
దేశం సంగతి నాయకులకు వదిలేద్దాం. దేశాన్నీ, ప్రజల్నీ తాకట్టు పెడతారో, అమ్ముకుంటారో, ప్రజాస్వామ్యం పీకి పిసికేస్తారో వాళ్లకీ, ప్రజలకీ వదిలేద్దాం. ప్రస్తుతం మన ఈ కూలిన గూడును కాపాడుకోవటం, మన తక్షణ కర్తవ్యం అంది డాగీ. అవును. ఈ గంజాయి దమ్ముగాళ్లని తక్షణం తరిమేయకపోతే ఈ చోటును తమ ‘అడ్డా’ గా మార్చుకునే ప్రమాదం ఉంది అంది డాంకీ. అయితే ‘సేవ్‌ ది హౌజ్‌’ మిషన్‌ ప్రారంభించండి. నేను కనపడకుండా వాళ్ల మీద రాళ్ల దాడి చేస్తాను. డాగీ నువ్వు దిక్కులు పిక్కటిల్లేట్టు అరుపు లంకించుకో. వాళ్లిటు వైపు వస్తే, డాంకీ వెనక కాళ్లతో అటకాయిస్తుంది. దొరికితే నుద్దూ ‘పిక్కలు’ వదలకు. రెడీ ‘ఒన్‌ టూ త్రీ’ చెప్పాడు అబ్బాయి.
ఉరేయ్‌ ఈ కుక్క నా పిక్క పట్టిందిరోయ్‌ అని పీచు గడ్డంవాడు, నా తల పగిలిందిరోయ్‌ అని పిల్లి మీసాలోడు, నా నడుం విరిగిందిరోయ్‌ అని బట్ట గుండోడు అరుస్తూ, అరుగు మీది నుంచి కిందికి దొర్లి పారిపోయేరు. సొతంత్రం స్వర్గలోకం అన్నారు. కూలిన కొంపయితేనేం మన కొంపను మనం రక్షించుకోవాలి అంది డాగీ. నా వెనుక కాళ్ల సత్తువ పరీక్షించుకునే ఛాన్సు దక్కింది నాకు అంది డాంకీ. అరుగు దిగి వెళ్లిపోయేడు అబ్బాయి.

మండుతున్న మణిపూర్‌నిశ్చేష్టంగా మోదీ

గత గురువారం నుంచి మణిపూర్‌ మళ్లీ భగ్గుమంటోంది. హింసకు దిగినవారిని కట్టడి చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 50 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను పంపింది. దీనితో మణిపూర్‌లో నియోగించిన కేంద్ర సాయుధ పోలీసుదళాల సంఖ్య అయిదువేలకు చేరింది. సోమవారం నాటికి హింసాత్మక సంఘటనలు మరింత పెచ్చరిల్లాయి. మెయితీ వర్గానికి చెందిన రెండేళ్ల బాలుడి తల లేని మొండెం, ఆ బాలుడి నాయనమ్మ అర్థ నగ్న మృతదేహం బరాక్‌ నదిలో తేలుతూ కనిపించాయి. మెయితీలు, కుకీల మధ్య ఘర్షణల్లో మరో ఆరుగురు మరణించారంటున్నారు. భద్రతా దళాలకు కుకీ ఆందోళన కారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పరిస్థితి విషమించిన తరవాత మణిపూర్‌లోని చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యా సంస్థలను మంగళవారం దాకా మూసేశారు. ఈ లోగా మణిపూర్‌లో అధికారంలో ఉన్న ఎన్‌.డి.ఎ. ప్రభుత్వానికి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నాయకుడు కోన్రాడ్‌ సంగ్మా మద్దతు ఉపసంహరించారు. అయితే ఎన్‌.డి.ఎ. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదు. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అసమర్థత, తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత వల్ల గత 19 నెలలుగా మణిపూర్‌ అగ్నిగుండంగా మారింది. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి మోదీ సర్కారు ఇంతవరకు చేసింది ఏమీలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉదాహరణ ప్రాయంగా ఒక్కసారి మణిపూర్‌ వెళ్లివచ్చారు. కానీ ఆయన ఘర్షణ పడ్తున్న మెయితీ, కుకీల ప్రతినిధులతోగానీ, సామాన్య ప్రజలతోగానీ సంప్రదింపులు జరపనేలేదు. కనీసం బాధితులను పరామర్శించిన పాపాన కూడా పోలేెదు. అతిథిగృహంలో కూర్చుని కొంతమంది ఉన్నతాధికారులను పిలిపించి పరిస్థితిని సమీక్షించాననిపించుకుని దిల్లీ వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ అయితే దేశదేశాలూ తిరుగుతున్నారు కానీ 2023 మే మూడు నుంచి మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా ఆ రాష్ట్రాన్ని సందర్శించాలన్న ఆలోచనే ఆయనకు రాలేదు. ఈ లోగా డజన్ల కొద్దీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అనేక విదేశీయాత్రలు చేసి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన విదేశీ యాత్రల్లోనే ఉన్నారు. మణిపూర్‌లో అంటుకున్న అగ్గిని ఆర్పేయడానికి మోదీ చేసిందేమీ లేకపోయినా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నిలిపివేయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న అమిత్‌ షా మణిపూర్‌లో పరిస్థితి విషమించిందని తెలిసి ప్రచారం మధ్యలోనే నిలిపివేసి దిల్లీ పరుగెత్తారు. అక్కడా ఆయన చేసిందల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడమే. హింస చెలరేగుతున్న ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమిత్‌ షా కూడా చేసింది, చేస్తున్నది ఏమీలేదు. మణిపూర్‌ మండిపోతుంటే ఇంత ఘోరంగా నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం మోదీకి, అమిత్‌ షాకే చెల్లింది. అక్కడి గవర్నర్‌ హింస చెలరేగిన వెంటనే పరిస్థితిని కట్టడి చేయాలని అమిత్‌ షాకే కాక రాష్ట్రపతికి కూడా మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను తొలగించాలని ఎంతమంది చెప్తున్నా మోదీ ప్రభుత్వ చెవికెక్కడం లేదు.
డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉంటే ఏ రాష్ట్రమైనా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, శాంతి భద్రతలు సుస్థిరంగా ఉంటాయని ఊదరగొడ్తున్న మోదీ ప్రభుత్వం మణిపూర్‌ను మాత్రం పట్టించుకోవడంలేదు. నిజానికి అక్కడ అధికారం సంపాదించడానికి మెయితీ, కుకీ జాతుల మధ్య తంపులు పెట్టిందే మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. జాతి కలహాలు ఇప్పుడు అక్కడ పెద్ద భూతంలా తయారయ్యాయి. గత 19 నెలల కాలంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది మహిళలమీద అత్యాచారాలు జరిగాయి. మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఇదంతా ఏదో పరాయి దేశంలోనో, మనకు సంబంధంలేని వ్యవహారంగానో మాత్రమే మోదీ సర్కారు భావిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించడానికి లేదా రాజకీయ పరిష్కారం కనుగొనడానికి కానీ చేసిందేమీలేదు. భిన్న జాతుల వారి మధ్య విద్వేషంనింపి అధికారం మాత్రం సంపాదించింది. సామాజిక-రాజకీయ విభేదాలకు ఆజ్యం పోసింది. మణిపూర్‌లో కొనసాగుతున్న విధ్వంసం మునుపెన్నడూ లేనిదని, ఈ చిచ్చును చల్లార్చడానికి రాజకీయ, పరిపాలనాపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు చెవిని ఇల్లుకట్టుకుని చెప్తున్నా మోదీ ప్రభుత్వంలో చలనంలేదు. మెయితీ మద్దతుదార్లు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం పెడ్తున్నారు. కర్ఫ్యూ ఉల్లంఘించి మెయితీ ఉద్యమకారులు ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం నాటికి బయటపడ్డ ఏడు మృతదేహాలు కూడా అంతకు ముందు కుకీలు అపహరించుకువెళ్లిన వారివేనంటున్నారు. ఇంఫాల్‌ లోయలోని అయిదు జిల్లాల్లో మెయితీల ప్రభావం ఎక్కువ. ఆందోళనకారులు ఎన్నికల అధికారి కార్యాలయాన్ని కూడా ఆక్రమించారు. ఇంటర్నెట్‌ సదుపాయం నిలిపివేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రభుత్వ ఆలోచన కేవలం భ్రమే. దీనివల్ల అందవలసిన సమాచారం అందకుండా పోతోంది. ఇది అదనపు సమస్యలకు దారి తీస్తోంది. మణిపూర్‌లో హింసాకాండ చెలరేగుతుంటేనే బీజేపీకి ప్రయోజనం అన్న ఆరోపణలూ వస్తున్నాయి. కనీసం వీటిని ఖండిరచడానికైనా మోదీ ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు. మణిపూర్‌లోని వివిధ పక్షాలతో సంప్రదించాలని, ఆ తరవాత దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఏం జరుగుతోందో వివరించి పరిస్థితి అదుపు చేయడానికి ఏం చేయాలో నిర్ణయించాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నవంబర్‌ 25న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే లోగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే పరిస్థితి సానుకూలంగా మారుతుంది. ఈ సూచననూ మోదీ సర్కారు ఖాతరు చేయడంలేదు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా విమర్శిస్తాయి. కానీ మణిపూర్‌లో అసమర్థ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను తొలగించి రాష్ట్రపతి పాలన విధిóంచాలని ప్రతిపక్షాలు కోరుతున్నా మోదీ ప్రభుత్వం మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిందల్లా పౌరుల మీద జరిగిన మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడమే. కేంద్రం తీసుకున్న మరో చర్య ఏమిటంటే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎ.ఎఫ్‌.ఎస్‌.పి.ఎ.) మళ్లీ అమలు చేయడమే. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. శనివారం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చెందిన ఇంటిమీద కూడా దాడి చేశారు. ఒక ఎమ్మెల్యే అయితే తన ఇంటి చుట్టూ బంకర్లు నిర్మించుకు కూర్చున్నారు. తీవ్ర దాడులు ఎదుర్కుంటున్న మెయితీలు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది.

కార్పెంటర్స్, పెయింటర్స్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం.. నూతన కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం:: కార్పెంటర్స్ అండ్ పెయింటర్స్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యము అని నూతన కమిటీ వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పెంటర్స్, పెయింటర్స్ యూనియన్ పెద్దలను కలిసి సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో సమస్యలపై తీవ్రంగా చర్చించి సమస్యల పరిష్కారానికి ఐక్యమత్యంతోనే మార్గం సుగమం అవుతుందని తెలిపారు. తదుపరి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో కార్పెంటర్ అధ్యక్షులుగా కే. శివ, ప్రధాన కార్యదర్శిగా కే.నంజుండ చారి, పెయింటర్ అధ్యక్షుడుగా గడ్డం రాజు, కోశాధికారిగా సాయిరాజును ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఏ సమస్య అయినా ఎదురైనప్పుడు కలిసికట్టుగా చర్చించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్మయంతో, ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.

వ్యాసరచన పోటీలో ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థికి ప్రథమ బహుమతి

విశాలాంధ్ర ధర్మవరం : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 99 వ జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా పట్టణంలోని కాగితాల వీధిలో గల శ్రీ ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇటీవల నిర్వహించడం జరిగింది. పట్టణంలోని 24 పాఠశాలల నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐదు జూనియర్ కళాశాల నుండి నూరు మంది రెండు డిగ్రీ కళాశాల నుండి 35 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయిలో ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి టి మమతారెడ్డి ప్రథమ బహుమతిని గెలుపొందడం జరిగిందని జిల్లా జాయింట్ బాలవికాస్ కోఆర్డినేటర్ కరణం ఆదిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ కళాశాల నుండి షేక్ పర్వీన్ తాజ్ ద్వితీయ బహుమతిని, పద్మావతి డిగ్రీ కళాశాల నుండి టీ. అర్సియా ద్వితీయ బహుమతిని గెలుపొందడం జరిగిందని తెలిపారు. త్వరలో వీరందరికీ పుట్టపర్తిలో బహుమతులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి తో పాటు శ్రీ సత్యసాయి సేవా సమితి తరపున జాయింట్ కన్వీనర్ శేషాచారి,కన్వీనర్ నామ ప్రసాద్, జనార్ధన్, ప్రధమ, ద్వితీయ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చట్ట పరిధిలోనే జీవించాలి…

రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర -ధర్మవరం: చట్ట పరిధిలోనే గ్రామ ప్రజలు జీవించాలని, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకున్నప్పుడే మంచి జీవితం లభిస్తుందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీ, డి.ఎస్.పి, రూరల్ సీఐ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఓ గ్రామంలో గ్రామ సభను నిర్వహించి, చట్టాలపై అవగాహన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మండల పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గొడవలకు దూరంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పేకాటకు దూరంగా ఉండాలని, మద్యానికి బానిస కాకూడదని వారు తెలిపారు. తదుపరి సైబర్ క్రైమ్ పైన రోడ్డు సేఫ్టీ పైన కూడా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. చిన్నచిన్న గొడవలకు పోరాదని, పోలీస్ స్టేషన్లు చుట్టూ కోర్టులు చుట్టూ తిరిగితే సమయం వృధా అవుతుందని, సమన్వయంతో ఆలోచనతో నిర్వహిస్తే అంతా సుఖప్రదం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా నాటు సారా కాచడం, అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. బాల్య వివాహాలు చేయరాదని, బాలికలు ఉన్నత స్థాయి వరకు చదివించే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు వస్తే నిగా ఉంచి మా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సమన్వయంతో ఐక్యమత్యంతో మెలిగినప్పుడే గ్రామ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు పాల్గొన్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగ స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం.. జీర్ణోదరణ సంఘం

విశాలాంధ్ర- ధర్మవరం:బీ పట్టణంలోని చెలిమి రోడ్డు వద్ద గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో చెలిమి జీర్నోద్ ధారణ సంగం ఆధ్వర్యంలో కార్తీకదీపం తో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ స్థూపం యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానమున నిర్వహిస్తున్నట్లు చెలిమి జీర్ణో ధారణ సంఘము సీతారామాంజనేయ స్వామి మహిళా మండలి వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 25న గణపతి పూజ, గంగా, శివ, గంగ హారతి, గంగాభవాని విశేష పూజల కార్యక్రమంతో పాటు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రులు సత్త కుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలక్క మధుసూదన్ రెడ్డి, పర్సనల్ సెక్రెటరీ ఉపముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ మధుసూదన్, ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తదితరులు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమం అర్చకులు మోహన్ స్వామి చంద్రమౌళి స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.