మయన్మార్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బౌద్ధ ఉత్సవ వేడుకల సమయంలో పారాగ్లైడర్ ద్వారా బాంబు దాడి జరిగింది.ఈ దారుణ ఘటనలో 24 మంది మృతిచెందగా, 47 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.చాంగ్ యు టౌన్షిప్లో సుమారు 100 మంది జనం సమూహంగా ఒక చోట గుమిగూడి ఉన్న సమయంలో, పారాగ్లైడర్ ద్వారా రెండు బాంబులు విసరడంతో ఈ ఘటన జరిగింది.
ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
2021లో సైనిక తిరుగుబాటు
ఈ దాడి థాడింగ్యుట్ పండుగ సందర్భంగా జరిగింది. థాడింగ్యుట్ పండుగను ఁలైట్ల పండుగఁ అని కూడా అంటారు.ఈ సందర్భంగా మయన్మార్ అంతటా కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి, సామూహిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతాయి.చాంగ్ యు టౌన్షిప్లో ఈ వేడుకలు జరుపుకునే సమయంలో సైనిక బలగాలపై నిరసనలు, ఆంగ్ సాన్ సూకీ సహా అన్ని రాజకీయ ఖైదీల విడుదలకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది.2021లో జరిగిన సైనిక తిరుగుబాటుతో మయన్మార్లో సైన్యం అధికారాన్ని అదుపులోకి తీసుకుంది.అప్పటినుండి మయన్మార్లో ప్రజలు,సైన్యం మధ్య తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ఈ సంఘటనలలో ఇప్పటివరకు 5,000కంటే ఎక్కువ పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తోంది.
అంతర్జాతీయ ఆంక్షల కారణంగా విమానాలు, జెట్ ఇంధనంలో కొరత ఏర్పడిన నేపథ్యంలో, సైన్యం సాధారణ స్థలాల్లో మోర్టార్ తూటాలు విసిరే పారామోటర్ దాడులను తరచుగా అమలు చేస్తోంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా చాంగ్ యు టౌన్షిప్లో ఇలాంటి దాడులు చోటు చేసుకున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది.సైన్య తిరుగుబాటు తర్వాత, మయన్మార్లో డిసెంబర్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో దేశంలోని రాజకీయ పరిస్థితులు మరింత అస్థిరంగా మారినట్లు భావిస్తున్నారు.


