– కామ్రేడ్ సంగీత అలియాస్ లలిత ఎన్ కౌంటర్ లో మృతి
–ములుగుందంలో నెలకొన్న స్తబ్దత
–మృతదేహం కోసం ఎదురుచూపు
విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : కుల సంఘాల నిర్మూలన ఉద్యమాల వైపు ఆకర్షితురాలై మావోయిస్టు నక్సలిజం వైపు వెళ్ళి మృత్యు ఒడిలోకి చేరిన ఘటన మండల పరిధిలోని ములుగుందం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు… ములుగుందం గ్రామానికి చెందిన గోనెగండ్ల ఎస్తేరమ్మ, దుబ్బన్న దంపతులకు ఐదుగురు సంతానం. మొదటి సంతానం లలిత, అనంతరం నలుగురు మగపిల్లలు. ఈయన వ్యవసాయ కూలీ గా పని చేస్తూ జీవనం కొనసాగించేవారు. లలిత 10వ తరగతి వరకు కోవెలకుంట్ల లోని గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం హైదరాబాదులో నర్సింగ్ ను పూర్తి చేసింది. అక్కడే ప్రైవేట్ ఆస్పత్రిలలో పనిచేశారు. 2006 సంవత్సరంలో ములగుందం నుండి చదువు, ఉద్యోగం పేరుతో ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే గత పది సంవత్సరాల క్రితం ములుగుందం గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని లలిత పై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆమె అంగీకరించలేదు. కొన్ని నెలల పాటు గ్రామంలో ఉండి తిరిగి వెళ్ళిపోయారు. హైదరాబాదులో ఉద్యోగం చేసే క్రమంలో ఇక్కడి ఉద్యమాలతో పరిచయం ఏర్పడి కొంత కాలం KNPS లో క్రియాశీలంగా పనిచేసింది. దండకారణ్యంలో రూపుదిద్దుకుంటున్న జనతన సర్కారు నిర్మాణంలో పాలు పంచుకునేందుకు ఆ పార్టీ పిలుపునందుకొని నర్స్ గా ఆదివాసీలకు తన సేవలు అందించేందుకు 15 సంవత్సరాల క్రితం పూర్తి స్థాయి కార్యకర్తగా మావోయిస్టు ఉద్యమం లోకి వెళ్లినట్లు సమాచారం. ఈనెల 21వ తేదీన ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలోని అబుజ్మార్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు తో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో ములుగుందం గ్రామానికి చెందిన దళిత యువతి, మావోయిస్టు ఉద్యమకారిని కామ్రేడ్ సంగీత అలియాస్ లలిత కూడా ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలియడంతో గ్రామంలో స్తబ్దత నెలకొంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు నారాయణపూర్ కు బయలుదేరి వెళ్లారు. అయితే అక్కడి పోలీసులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల మృదేహాలను పోలీసులు మృతుల బంధువులకు ఇవ్వకుండా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులను అక్కడి పోలీసులు ఎవ్వరిని పట్టించుకోవడంలేదని సమాచారం.