బీజేపీ, ఎంఐఎంపై మమత ఆరోపణ
కోల్కతా: ఎన్నికల వేళ తమ రాష్ట్రంలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు అలజడి సష్టించడానికి కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో భాగంగా జాబితా నుంచి తమ పేర్లు గల్లంతు కావడాన్ని నిరసిస్తూ కొందరు స్థానికులు ఏడుగురు న్యాయాధికారుల్ని మాల్దా జిల్లాలో ఘెరావ్ చేసిన సంఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎంఐఎం పార్టీకి చెందిన ఒక వ్యక్తిని శుక్రవారం అరెస్టుచేశారు. రాష్ట్రంలో అలజడి రేపేందుకు బీజేపీ, ఎంఐఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్లు కుట్ర పన్నాయనడానికి ఇది నిదర్శనమని మమత మిమర్శించారు. ఈ ఘెరావ్ వెనక బీజేపీకి చెందిన “హైదరాబాదీ పక్షి” ఉందని మమత పరోక్షంగా అసదుద్దీన్ ఒవైసీపై విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంలో పోలీసులు అరెస్టుచేసిన ముఫఖ్ఖరుల్ ఇస్లామ్ 2021 శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా ఇటహార్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బుధవారం జరిగిన న్యాయాధికారుల ఘెరావ్ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న అతణ్ని బాగ్డోగ్రా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇస్లాం బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కి పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా నిర్బంధించామని పోలీసులు తెలిపారు. మాల్దా జిల్లాలో న్యాయాధికారుల ఘెరావ్కు అతడే బాధ్యుడని వివరించారు.


