కళ్యాణదుర్గం, విశాలాంధ్ర: కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, మెడికల్ మాఫియా వ్యవహారాలపై ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై డబ్బు దండుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, ప్రజా సంఘాలు నాయకులు ఆర్కే రాజు, తిప్పేస్వామి ఆరోపించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అంబులెన్స్ సేవలు అందించడంలో కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉచిత అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో గోళ్ళ గ్రామానికి చెందిన పునీత్రాజ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇందుకు నిదర్శనమని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల మాఫియా హస్తం ఉన్నదని ఆరోపిస్తూ, నిర్లక్ష్య వైఖరిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కళ్యాణదుర్గం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.


