సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించారంటూ దాఖలైన అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈవిషయాన్ని అత్యవసరంగా ప్రస్తావించిన న్యాయవాదికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, “మా సమయాన్ని,మీ సమయాన్ని వృథా చేయొద్దు” అంటూ స్పష్టం చేసింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం వేలాది మంది విద్యార్థులు,యువత సీజేపీ ఇచ్చిన పిలుపుతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
అనంతరం పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రయట్ కంట్రోల్ గేర్తో ఉన్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.
సీజేపీ నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం
విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేసిన వీడియోలు ఉన్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, “మేము ఎలాంటి వీడియోలు చూడదలచుకోలేదు” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై సీజేపీ నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం అతిగా వ్యవహరించిందని,పోలీసుల లాఠీచార్జ్లో వందలాది మంది నిరసనకారులు గాయపడ్డారని ఆరోపించారు.నిజమైన సమస్యపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అవమానకరమైన రోజుగా మిగిలిపోతుందని సీజేపీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ప్రతి విషయాన్నీ కోర్టులోకి తీసుకురావద్దు
మరోవైపు, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం ప్రతి విషయాన్నీ కోర్టులోకి తీసుకురావద్దు అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.


