ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించనుంది. తుఫాన్ కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొంథా సైక్లోన్ స్పెషల్ స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్గా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, తాజాగా.. సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ కొనసాగనుంది. మరికాసేపట్లో కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ల్యాండ్ అవుతారు. అనంతరం ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి, వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు.మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. తుఫాన్ ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారికి ప్రభుత్వం రూ.3 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.


