కలెక్టర్ జి. లక్ష్మీశ
విశాలాంధ్ర`విజయవాడ: రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు విశేషంగా తోడ్పాటు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు రైజ్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ సహకారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్ సాధనలో రైజ్ కీలకంగా నిలుస్తుందని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు ఉత్పత్తి దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, నాణ్యమైన శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
రైజ్తో మహిళలకు ఆర్థిక సాధికారత
- Advertisement -
RELATED ARTICLES


