మొజ్తాబా ఖామేనీ సంకేతాలు
తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ..హోర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖామేనీ కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటించారు. హోర్మూజ్పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్లో పరిస్థితులు కుదుటపడలేదు. ఈ క్రమంలో జలసంధిని కొత్త దశకు తీసుకెళ్తామంటూ మొజ్తాబా ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. అయితే… ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని సుప్రీం నేత స్పష్టంచేశారు. కానీ…ఎట్టిపరిస్థితుల్లో తమ హక్కులను మాత్రం వదులుకోమని వ్యాఖ్యానించారు. దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖామేనీ సహా, అనేకమంది కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ దృఢ నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని వెల్లడించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టాలన్నింటికీ పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తామన్నారు.
మండిపడిన ట్రంప్…
హోర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. జలసంధి మీదుగా వెళ్లే ట్యాంకర్లపై ఇరాన్ టోల్ వసూలుచేస్తున్నట్లు వెలువడుతున్న వార్తల గురించి ప్రస్తావించారు. వారు అలా చేసి ఉండరాదని, ఒకవేళ చేస్తే వెంటనే ఆపేయాలని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. ఇరాన్ సహకరించినా, సహకరించకపోయినా జలసంధి మీదుగా చమురు సరఫరా త్వరగా ప్రారంభమవుతుందని మరో పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు.


