మహాత్మా గాంధీ (Mahatma Gandhi ) స్వయంగా రాసిన అరుదైన చేతిరాత ప్రతులు వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యాయి.సత్యం, అహింస, సేవ వంటి అంశాలపై ఆయన తన సన్నిహితుడు,స్వాతంత్ర్య సమరయోధుడు ఆనంద్ టీ. హింగోరానీకి రాసిన మొత్తం 688 చేతిరాత ప్రతులు ఏకంగా రూ.16.2 కోట్లకు విక్రయమయ్యాయి.భారతీయ ప్రతుల వేలంలో ఇంత భారీ మొత్తానికి అమ్ముడైన సేకరణగా ఇవి రికార్డు సృష్టించాయి.
ఆనంద్ టీ. హింగోరానీ సతీమణి విద్య మరణించిన తర్వాత గాంధీ ఆయనకు అండగా నిలిచారు.
”ఎ థాట్ ఫర్ ది డే” పేరుతో పుస్తకంగా..
స్నేహితుడికి మార్గదర్శకంగా ఉండేలా వరుసగా సందేశాలు రాస్తూ పంపించారు. దాదాపు రెండేళ్లపాటు గాంధీ రాసిన ఈ సందేశాలను హింగోరానీ భద్రపరిచారు. అనంతరం వాటిని సేకరించి ”ఎ థాట్ ఫర్ ది డే” పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఈ అరుదైన సేకరణలోని గాంధీ చేతిరాత ప్రతులతో పాటు ఆయనకు సంబంధించిన ఫొటోలను కూడా వేలానికి ఉంచారు. సాఫ్రోన్ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించిన ఈ వేలంలో మొత్తం 688 ప్రతులు రూ.16.2 కోట్లకు అమ్ముడై భారీ రికార్డును నమోదు చేశాయి.


