Homeఆంధ్రప్రదేశ్ప్రధాని నరేంద్రమోదీ రాజీనామా చేయాలి

ప్రధాని నరేంద్రమోదీ రాజీనామా చేయాలి

- Advertisement -

*ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలి
*బీజేపీ పాలనలో అన్ని పరీక్షలు లీకులే

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

(విశాలాంధ్ర-తిరుపతి)

‘నీట్’ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని… కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ సీపీఐ కార్యాలయం నుంచి పద్మావతి పార్క్ కూడలి వరకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కూడలి వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ… దేశంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలని, నీట్ పరీక్ష అక్రమాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ పర్యావరణ వేత్త, సైంటిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ 19 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దేశ ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. మణిపూర్‌లో మహిళలపై దారుణాలు జరిగినా, రామాలయంలో రూ. 200 కోట్ల దొంగతనం జరిగినా, ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి కాపలా కాసే సైనికుల కోసం మైనస్ డిగ్రీల చలిలోనూ రక్తం గడ్డకట్టకుండా ఉండే సాంకేతికతను కనుగొని, మంచు పర్వతాలను కరిగించి ప్రజలకు తాగునీరు అందించిన గొప్ప సైంటిస్ట్‌ను సైతం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ పాలనలో 89 పరీక్షలు లీక్

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్, సీబీఎస్‌ఈ, యూపీపీఎస్సీ, నీట్ వంటి దేశవ్యాప్తంగా దాదాపు 89 రకాల పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఈశ్వరయ్య ఆరోపించారు. పరీక్షల లీకేజీల వల్ల మానసిక వేదనకు గురై 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కార్పొరేట్ మాఫియా చేతుల్లో పెడుతోందని ఆరోపించారు. సోనమ్ వాంగ్‌చుక్ అక్రమ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, సోమవారం జరగబోయే ‘చలో పార్లమెంట్’ కార్యక్రమానికి విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్ని రాజు, గురవయ్య, సుధాకర్ రెడ్డి, రాధాకృష్ణ, నదియా, కత్తి రవి, చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు ఎన్.డి. రవి, పద్మనాభ రెడ్డి, రాజా, నాగరాజు, మహేంద్ర, శివ, మంజుల, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు