షాపింగ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకున్న రష్యా
130 మందికి పైగా గాయాలు.. వారిలో 22 మంది చిన్నారులు
ఇది అత్యంత నీచమైన దాడి అని ఖండించిన అధ్యక్షుడు జెలెన్స్కీ
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడికి పాల్పడింది. మధ్య ఉక్రెయిన్లోని క్రివీ రిహ్ నగరంలో రద్దీగా ఉండే ఓ షాపింగ్ సెంటర్పై నిన్న (శుక్రవారం) డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో కనీసం 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడితో షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
క్షతగాత్రులలో 22 మంది చిన్నారులు ఉన్నారని, వారిలో ఐదుగురు సహా మొత్తం 29 మంది పరిస్థితి విషమంగా ఉందని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సహాయక బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇంకా కొంతమంది ఆచూకీ లభించలేదని అధికారులు వెల్లడించారు.
ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. తన సొంత నగరమైన క్రివీ రిహ్పై జరిగిన ఈ దాడిని ‘అత్యంత నీచమైన, కిరాతకమైన చర్య’గా అభివర్ణించారు. రష్యా రెండు దశల్లో దాడి చేసిందని, మొదటి డ్రోన్ దాడి జరిగిన 30 నిమిషాల తర్వాత సహాయక చర్యలకు వస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని రెండో డ్రోన్తో దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఇది ఉగ్రవాద చర్యేనని, దీనికి తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
ఈ దాడిని ‘ఉద్దేశపూర్వక ఉగ్రవాదం’గా ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ అభివర్ణించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. డ్రోన్లు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఇదే రోజు ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా జరిపిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.


