కొల్లేరు సరస్సులో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.కొల్లేరు సరస్సు పరిరక్షణ కేసు విచారణ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులోని అక్రమ చేపల చెరువులను తొలగించే చర్యల్లో అటవీశాఖకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ను కమిటీ ఆదేశించింది. కూల్చివేతల ప్రక్రియలో స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని అటవీ, పర్యావరణశాఖ అధికారులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సాధికార కమిటీ, తక్షణమే పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
ప్రమాదంలో కొల్లేరు సరస్సులో నివసించే వలస, స్థానిక పక్షుల మనుగడ
ఇదే సమయంలో కొల్లేరు సరస్సులో నివసించే వలస, స్థానిక పక్షుల మనుగడ ప్రమాదంలో పడుతోందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కమిటీ, కొల్లేరు సరస్సులో పెరుగుతున్న కాలుష్యానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది. అక్రమ చేపల చెరువులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు కావడంపై కూడా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ చెరువుల కూల్చివేతల పురోగతి, కాలుష్య నియంత్రణకు చేపట్టిన చర్యలు, సరస్సు పరిరక్షణ కోసం అమలు చేస్తున్న చర్యలపై పూర్తి నివేదికను త్వరితగతిన సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది.


