శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ చెలరేగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే సమయంలో పలాసలో జీడి వ్యాపారిని కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పలరాజు, గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.
విచారణ కోసమే వచ్చాం : పోలీసులు
అయితే, పోలీసులు మాత్రం ఓ కేసు విషయమై విచారణ కోసం వచ్చామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.సంబంధం లేని కేసుల్లోనూ తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.


