Wednesday, February 18, 2026
Homeఅంతర్జాతీయంశక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3ని పరీక్షించిన యూఎస్..

శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3ని పరీక్షించిన యూఎస్..

- Advertisement -

గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన క్షిపణి!
అగ్రరాజ్యం అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) మినిట్‌మ్యాన్‌-3ను విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాన్డెన్‌బెర్గ్‌ స్పేస్‌ బేస్‌ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల (సుమారు 24,000 కిలోమీటర్లు) అసాధారణ వేగంతో 4,200 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యమైన మార్షల్‌ దీవుల్లోని అమెరికా స్పేస్‌ అండ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ కమాండ్‌కు చెందిన బాలిస్టిక్‌ డిఫెన్స్‌ టెస్ట్‌ ప్రదేశానికి ప్రయాణించిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగం గురించి అమెరికా గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ జనరల్‌ థామస్‌ బుస్సెరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఁఈ ఐసీబీఎం పరీక్ష అమెరికా సైనిక సంసిద్ధతకు, అణు సామర్థ్యానికి నిదర్శనంఁ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు, ఈ పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని, ఇది రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో భాగంగా నిర్వహించే పరీక్ష అని ఆయన స్పష్టం చేశారు.

మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిలో అత్యంత శక్తిమంతమైన మార్క్‌-21 రీఎంట్రీ వెహికల్‌ అమర్చారు. అవసరమైతే దీనిలో అణు వార్‌హెడ్‌ను కూడా మోహరించే వీలుంది. గతంలో కూడా అమెరికా అనేకసార్లు ఈ క్షిపణి సామర్థ్యాలను పరీక్షించింది. గతేడాది నవంబర్‌లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందు కూడా ఒకసారి దీనిని పరీక్షించినట్లు సమాచారం. 1970ల నాటిదైన మినిట్‌మ్యాన్‌ క్షిపణి వ్యవస్థ స్థానంలో సెంటెనిల్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని అమెరికా యోచిస్తున్నప్పటికీ, మినిట్‌మ్యాన్‌-3 ఇప్పటికీ అమెరికా వాయుసేనకు అత్యంత నమ్మకమైన అస్త్రంగా కొనసాగుతోంది.

గోల్డెన్‌ డోమ్‌ ఏర్పాటుకు ట్రంప్‌ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం శ్వేతసౌధంలో ఒక కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో అమెరికా గగనతంలోకి ఎలాంటి శత్రు క్షిపణులు గానీ, అణ్వాయుధాలు గానీ ప్రవేశించకుండా అడ్డుకునేందుకు గోల్డెన్‌ డోమ్‌ అనే పేరుతో అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్‌ విజయవంతంగా వినియోగిస్తున్న ఐరన్‌ డోమ్‌ తరహాలోనే ఈ వ్యవస్థను అమెరికా కోసం రూపొందిస్తున్నట్లు ట్రంప్‌ వివరించారు.

ఈ ప్రతిష్టాత్మక గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణానికి సుమారు 175 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను యూఎస్‌ స్పేస్‌ ఫోర్స్‌ జనరల్‌ మైఖేల్‌ గుట్లీన్‌కు అప్పగించినట్లు తెలిపారు. తన పదవీకాలం ముగిసేలోపే ఈ వ్యవస్థ నిర్మాణం పూర్తవుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా అమెరికా అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మినిట్‌మ్యాన్‌-3 వంటి క్షిపణి పరీక్షలు జరుగుతున్న తరుణంలోనే ఃగోల్డెన్‌ డోమ్‌ః వంటి రక్షణ కవచం ఏర్పాటు ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు