నా అనుమతి లేకుండా చికిత్స చేయొద్దన్న భార్య గీతాంజలి
న్యూదిల్లీ: దేశ రాజధానిలోని జంతర్మంతర్ వద్ద 21 రోజులుగా నిరాహారదీక్ష చేస్తోన్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను శనివారం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు తగిన వైద్యసహాయం అందించాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిరసన ప్రాంతం నుంచి పోలీసులు తీసుకెళ్లారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో గత నెలాఖరులో దీక్ష ప్రారంభించగా…ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్ష్మీణించింది. చికిత్స నిమిత్తం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. కాగా, ‘తనకు ఎటువంటి చికిత్స అవసరం లేదని, ఒక వేళ నేను మరణిస్తే…దయ్యమై పోరాటం సాగిస్తాను’ అని వాంగ్చుక్ హెచ్చరించారు.
అడ్డుకున్న ఆందోళనకారులు…
‘కోర్టు ఆదేశాల ప్రకారం వాంగ్చుక్ను తరలిస్తోన్న సమయంలో నిరసనకారులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. జంతర్మంతర్ వద్ద నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించాలని, వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నాం’ అని దిల్లీ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఇదిలా ఉండగా, తన అనుమతి లేకుండా తన భర్తకు ఎటువంటి చికిత్సా అందించొద్దని వాంగ్చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో డిమాండ్ చేశారు. ‘ఆయన సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఉన్నారు. నా అనుమతిలేకుండా చికిత్స ప్రారంభించవద్దు. ఆయనకు ఏదైనా జరిగితే అందరూ బాధ్యులు కావాల్సి వస్తుంది. ఆయన నిన్న (శుక్రవారం) బాగానే కనిపించారు. ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మా వైద్యుడి అనుమతి లేకుండా ఏ చికిత్సా అందించడానికి వీలు లేదు. అది మా హక్కు’ అని మీడియాతో మాట్లాడారు గీతాంజలి.
ఉద్యమం ఆగదు…నిరాహార దీక్ష కొనసాగిస్తా: అభిజీత్ దీప్కే
సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి బలవంతంగా తరలించడంతో ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమం ఆగిపోదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. ఇక నుంచి తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ‘నేటి నుంచి దీక్ష ప్రారంభిస్తున్నాను. వెనకడుగు వేయొద్దని మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు జంతర్మంతర్కు రావాలని కోరుతున్నాను. 20న జరగాల్సిన పాదయాత్రను కొనసాగిస్తాం’ అని అభిజీత్ వెల్లడించారు.


