రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన మోసగాడు జగన్: మంత్రి కొండపల్లి
విజయనగరం: మజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ తీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిపై వైసీపీ రాజకీయ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని తీవ్రంగా విమర్శించారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి ఆదివారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఆర్ర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో మరో పొలిటికల్ డ్రామాకు గొడ్డలి పార్టీ తెరలేపిందని సెటైర్లు వేశారు. వైసీపీ నాయకుల కుట్రలకు ఆ ప్రాంత అన్నదాతలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకుల వైఖరిని మార్చుకోవాలన్నారు. అధికారంలో ఉండగా రాజధాని ప్రాంత రైతులకు ముప్పతిప్పలు పెట్టిన ఆ పార్టీకి ఊసరవెల్లిలా రంగులు మార్చడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రారంభమైతే కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో కుట్ర పన్ని అల్లర్లు సృష్టించడానికి గొడ్డలి పార్టీ కొత్త ప్రయత్నాలు చేస్తోందని మంత్రి ధ్వజమెత్తారు. అమరావతిని వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా మోసం చేశారని ఆగ్రహించారు. పర్యటన పేరుతో ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. వారిని స్థానిక రైతులు అడ్డుకుంటే ఆ వివాదాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం ఏంటి ? అని ప్రశ్నించారు. ప్రజల్లో సానుభూతి కోసం తెరలేపిన వైసీపీ బూటకపు పర్యటనలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొండపల్లి అన్నారు.
అమరావతిపై వైసీపీ డ్రామాలు
- Advertisement -


