విశాలాంధ్ర-హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలా ఫలితాలు వస్తే… హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా, అన్నీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టకపోగా… ఉన్న రోడ్లను కూడా కనీసం నిర్వహించే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల మంది ఆటో డ్రైవర్లను అడిగితే కాంగ్రెస్ ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో చెప్తారన్నారు. అట్లాగే… మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఉండే యువతను మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ. 2,500, వృద్ధులకు నెలకు రూ. 4,000 పెన్షన్ ఇస్మాని చెప్పారని… ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని… ఏం ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నిలదీశారు. జూబ్లీహిల్స్లో తమ పార్టీ అభ్యర్థి తిరిగి మంచి మెజారిటీతో గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


