ముప్పాళ్ళ భార్గవశ్రీ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ల దారిదోపిడి విధానంపై మడమ తిప్పింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు మాట మార్చి బాగున్న డిజిటల్ మీటర్లను తొలగించి ప్రజల కళ్లుగప్పి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తదుపరి షాపులు, పరిశ్రమలు, సంస్థలకు బిగించారు. ప్రస్తుతం నివాస గృహాలకు పెడుతున్నారు. వినియోగదారుల ముందస్తు అనుమతి లేకుండా, మోసపూరిత మాటలతో, బెదిరింపులతో మీటర్లు బిగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల గుండెలలో రైళ్లను పరిగెత్తిస్తున్న ఈ పరిణామాలకు కారకులు ఎవరు!
బడా కార్పొరేట్ అదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్లకు పదేళ్లపాటు నిర్వహణ డీబీఎఫ్ఓఓటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో కాంట్రాక్టును చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. తొలి దశలో 41 లక్షల కనెక్షన్లకు మీటర్లు పెడుతున్నారు. దశలవారీగా రాష్ట్రంలోని రెండు కోట్ల మంది వినియోగదారులకు మీటర్లు బిగిస్తారు. ఈ విధానం ద్వారా విద్యుత్ రంగాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రైవేటీకరణకు ఇది ఒక మెట్టు. దీని పేరే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్. సెల్ఫోన్ తరహాలో ముందుగానే డబ్బు చెల్లించి చార్జింగ్ చేయించుకోవాలి. అప్పుడే కరెంటు వస్తుంది. ముందు రూ.500 తగ్గకుండా బ్యాలెన్స్ వేయించుకోవాలి. బ్యాలెన్స్ అయిపోగానే మళ్లీ డబ్బు చెల్లించి రీచార్జి చేయించుకోవాలి. అలా రీచార్జి చేయించుకోకపోతే విద్యుత్ సరఫరా నిలిచి పోతుంది. కంపెనీవారే ఆన్లైన్లో బిల్లు పంపుతారు. తప్పులు వచ్చినా సమాధానంచెప్పే నాథుడు ఉండరు. ఏనాడూ మనం చూడని విధంగా… పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, వేసవి కాలం ఒక రేటు, చలికాలం మరొక రేటు వసూలు చేయటానికి దానికి ఒక ముద్దు పేరు పెట్టారు. అదే ‘’టైం ఆఫ్ ది డే’’ విధానం. దీని ప్రకారం ఒక రోజుని 4 భాగాలుగా విడగొడతారు. ప్రతి సమయానికి ఒక రేటు నిర్ణయిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఎక్కువ విద్యుత్ వినియోగిస్తారు కాబట్టి, ఆ సమయంలో మరింత ఎక్కువ చార్జీలు వసూలు చేయటానికే ఈ మోసపూరిత విధానం.
సింగిల్ ఫేజ్ మీటర్కు రూ.8,927, త్రీ ఫేజ్ మీటర్కు రూ.17,286 అదానీ కంపెనీకి జనం చెల్లించాలి. జిల్లాలను బట్టి రేట్లు తేడాలు ఉంటాయి. ప్రజల కళ్లు కప్పి 93 నెలలలో వాయిదాల పద్ధతిలో ఈ మొత్తం వసూలు చేస్తారు. రాష్ట్రంలోని రెండు కోట్ల మీటర్లకు దాదాపు రూ.25 వేల కోట్ల భారం జనం నెత్తిన పడుతుంది. బాగున్న పాత మీటర్లు వృథాగా పడేస్తారు. మీటర్లు తయారు చేసేది, బిగించేది, నిర్వహించేది సర్వం అదానీ కంపెనీనే! కాబట్టి వీరి దారిదోపిడికి అడ్డు అదుపు ఉండదు. ఈ స్మార్ట్ మీటర్లు ఏఎంఐ (అడ్వాన్స్డ్ మీటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఏఎంఆర్ (ఆటోమేటిక్ మీటర్ రీడిరగ్) సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటాయి. మన ఇంటిలోని స్మార్ట్మీటర్కు, అదానీ కంపెనీకి వైర్లెస్ ద్వారా అనుసంధానం చేస్తారు. కంట్రోల్ మొత్తం ప్రైవేటు సంస్థ చేతిలో ఉంటుంది. విద్యుత్ వినియోగాన్ని, డబ్బు వసూళ్లను వారే నియంత్రిస్తారు. పెత్తనం మొత్తం వారిదే. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే సగభాగం బడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్తు పంపిణీ కూడా అదానీ వంటి బడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం వేసిన విద్యుత్ లైన్లు, స్తంభాల నుంచి ప్రైవేట్ కంపెనీలు మనకు విద్యుత్ సరఫరా చేస్తాయి. స్మార్ట్ మీటర్లు బిగిస్తాయి. బిల్లులు వసూలు చేసుకుంటాయి. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అంటే ఇదే కదా! ఇప్పటికే స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అనేక చోట్ల వినియోగదారులు ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఫలితంగా దేశంలో ఇప్పటికే 56 శాతం విద్యుత్, 19 శాతం విద్యుత్ పంపిణీ వ్యవస్థ, 55 శాతం పునరుత్పాదక విద్యుత్ అదానీ లాంటి బడాకార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు శక్తులకు అప్పగించటానికి మోదీ ప్రభుత్వం 2003 నాటి ఎలక్ట్రిసిటీ చట్టాన్ని మార్చి విద్యుత్ సవరణ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో 2020న సంపూర్ణ లాక్డౌన్ సమయంలో తీసుకొచ్చింది. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్నందున చట్టం రూపం తీసుకోలేదు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా రైతు సంఘాలు, వినియోగదారుల సంఘాలు వివిధ రూపాలలో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ సవరణ బిల్లును అడ్డం పెట్టుకొని దేశంలోని వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు మూడు సంవత్సరాల్లో బిగించాలని 2021 ఆగస్టు 17న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ, ఉచిత విద్యుత్ పథకాల తొలగింపు, పేదలకు తక్కువ రేటుకి విద్యుత్ అందించే క్రాస్ సబ్సిడీ విధానం రద్దు, అందరికీ ఒకటే స్లాబ్, స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం తాఖీదులు ఇచ్చింది. అందుకు ఆర్డీఎస్ఎస్ (రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలులో భాగంగా ఆనాటి వైసీపీి, బీజేపీి ప్రభుత్వాలు కుమ్మక్కు అయ్యి రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపునకు రంగం సిద్ధం చేశాయి. ఒక్కొక్క మీటరు ఖర్చు, నిర్వహణ కలిపి రూ.35 వేల రేటు నిర్ణయించారు. ఇదొక భారీ కుంభకోణం. అదానీకి, తమ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలకు రూ.13,252 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపుసెట్లకు మీటర్లు బిగించటంపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. బిగించిన మీటర్లను పీకి వేశారు. ఇక గత్యంతరం లేని స్థితిలో పంపు సెట్లకు మీటర్ల బిగింపు తాత్కాలికంగా ఆగింది. అయినా పంపుసెట్లకు మీటర్ల బిగింపు ప్రమాదం పొంచే ఉంది.
ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచేది లేదని, బాదుడు ఆపుతామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. అధికారంలో ఉన్న తొమ్మిది నెలల్లోనే వినియోగదారులపై రూ.15,485 కోట్ల సర్దుబాటు చార్జీల భారం మోపింది. ఈ భారంకాక నాలుగు రకాల అదనపు సర్దుబాటు చార్జీలు 2019, 22, 23, సంవత్సరాల్లో వినియోగించిన కరెంటుపై మళ్లీ అదనంగా కోట్ల రూపాయలలో బాదుతున్నారు. ఈ బాదుడుకి స్మార్ట్ మీటర్ల దోపిడీ మరింతగా తోడయ్యింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇతర అన్ని రంగాలతోపాటు విద్యుత్తు రంగంలో కూడా ప్రైవేటీకరణ విధానాలను పార్లమెంటులో తమకున్న మెజారిటీని అడ్డం పెట్టుకుని విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోయినా దానిని దొడ్డిదారిలో అమలు చేస్తూ విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచే విధానా లను చేపట్టింది. ఈ విధానాలను తమిళనాడు లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తు న్నప్పటికీ రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రెట్టించిన ఉత్సాహంతో అమలు చేస్తున్నది. విద్యుత్ రంగంలో ఈ ప్రైవేటీకరణ విధానాలను ఆదానీలాంటి బడా కార్పొరేట్ వర్గాలకు లాభాలు చేకూర్చటానికే నని స్మార్ట్ మీటర్ల పథకం తేటతెల్లం చేస్తోంది. విద్యుత్తు రంగంలో ఈ దారి దోపిడీ విధానాలను ఓడిరచటానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రజలు, ప్రజాసంఘాలు సాగిస్తున్న ఆందోళనలు మరింత సంఘటితంగా సాగించాడానికి నడుం బిగించాలి.
సెల్ : 98481 20105